Nov 17,2023 23:51

ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసిన డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు

ప్రజాశక్తి-దేవరాపల్లి
గత ప్రభుత్వాల మాదిరిగా ఎన్నికల్లో ఓట్లేసిన వారికే న్యాయం చేస్తానని చెప్పకుండా, వైసిపి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకు ఉన్న హక్కులను కాపాడుతూ అర్హతే ప్రామాణికంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు తెలిపారు. శుక్రవారం దేవరపల్లిలో నిర్వహించిన జగన్‌ ఎందుకు కావాలంటే అనే కార్యక్రమంలో భాగంగా వాలంటీర్‌ అధ్వర్యంలో డిప్యూటీ సిఎం పలు గృహాలను సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలను, ప్రయోజనాలను ప్రజలకు వివరించారు.
ఆరోగ్య సంరక్షణ కార్డులు అందజేత
పశువులు, గొర్రెల మేకల పెంపకం దారులకు క్యూఆర్‌ కోడ్‌తో హోలోగ్రామ్‌ స్టిక్కర్లు అంటించిన ఆరోగ్య సంరక్షణ కార్డులను పలువురు పాడి రైతులకు డిప్యూటీ సిఎం బూడి అందజేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పశువుల కోసం పశు సంచార అంబులెన్స్‌ల ద్వారా సేవలందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు కిలపర్తి భాస్కరరావు, ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి, పార్టీ మండల అధ్యక్షులు బూరె బాబురావు, సచివాలయ కన్వీనర్‌ వెంకటరమణ, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.