అర్హులకు పథకాలు అందజేయడమే లక్ష్యం - జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ
ప్రజాశక్తి - పెదపాడు
సంక్షేమ పథకాలను నూరుశాతం అర్హులకు అందించడమే 'జగనన్న సురక్ష' కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అన్నారు. పెదపాడు మండలం సత్యవోలులోని గంటా వెంకట కనకం పార్వతమ్మ కల్యాణ మండపంలో మంగళవారం 'జగనన్న సురక్ష' కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు ధ్రువీకరణ పత్రాలను ఆమె అందించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ అర్హతుండి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పథకాలు అందని పేదలను గుర్తించి వారికి సంక్షేమ పథకాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మండలంలో ఇల్లు లేని ప్రతి నిరుపేదకూ పక్కా గృహం అందించామన్నారు. వైసిపి బిసి సెల్ జిల్లా అధ్యక్షులు గంటా ప్రసాదరావు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ జరగని రీతిలో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సత్యవోలులో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షురాలు బత్తుల రత్నకుమారి, సర్పంచి రంభ ఉమామహేశ్వరి, జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆళ్ల సతీష్ చౌదరి, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు అప్పన్న ప్రసాద్, మండల సచివాలయాల కన్వీనర్ గోపీ మాట్లాడగా తహశీల్దార్ విజయకుమార్రాజు, ఎంపిడిఒ ఎస్.నిర్మలజ్యోతి, సొసైటీ అధ్యక్షులు అక్కినేని రాజశేఖర్ పాల్గొన్నారు.










