
ప్రజాశక్తి - చేబ్రోలు : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు వివక్షత లేకుండా అర్హతే ప్రమాణికంగా సంక్షేమ పథకాల లబ్ధిని వైసిపి ప్రభుత్వం అందిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ వ్యవహారాల శాఖమాత్యులు షేక్ బెపారి అంజాద్ బాషా అన్నారు. ఆదివారం చేబ్రోలు మండలం వడ్లమూడిలో రూ.60 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ షాదీఖానాను ఆయన న్రపాంరభించారు. రాష్ట్ర శాసనమడలి చీఫ్విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్యతో శిలఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశారన్నారు. మైనార్టీలను రాజకీయంగా అభివృద్ధి చేయాలని అన్ని రకాల పదవులలో నియమిస్తున్నారన్నారు. ఎప్పుడు లేని విధంగా ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమం, అభివృద్ధికి 18 రకాల సంక్షేమ పధకాల ద్వారా, 35 రకాల అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పారదర్శకంగా లబ్ధి చేకూరుతుందన్నారు. నియోజకవర్గంలో దశబ్ధాలుగా అభివృద్ధికి నోచుకొని రహదారులను విస్తరణ చేశారని, మద్రాసు కెనాల్ పై బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టారని, తాగునీరు లేని గ్రామాలకు నీరు సరఫరా అయ్యేలా కృషి చేశారని ఎమ్మెల్యేను అభినందించారు. త్వరలోనే పొన్నూరు లో ఆటోనగర్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే రోశయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో సంక్షేమ పధకాల ద్వారా పేదలకు రూ.1600 కోట్లు సాయం అందిందని, ఇందులో ముస్లిం మైనార్టీలకు రూ.85 కోట్లు లబ్ధి చేకూరిందని చెప్పారు. కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు మెంబరు సయ్యద్ సుభాని, వడ్లమూడి సర్పంచి మోరంపూడి అనితా రాణి, ఎంపీటీసీ షేక్ నిరీషా బేగం, ఉప సర్పంచి అహ్మద్, చేబ్రోలు, పెదకాకాని, పొన్నూరు మండ లాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.