ప్రజాశక్తి - కోసిగి రూరల్
ఆర్డిఎస్ కుడి కాలువ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పనులను వేగవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య కోరారు. ఆదివారం కోసిగిలో గోపాల్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా గిడ్డయ్య, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప, జిల్లా కార్యవర్గ సభ్యుడు భాస్కర్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. ఆర్డిఎస్ కుడి కాలువ ప్రాజెక్ట్ పనులపై అధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. పులికెనుమ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకాల ద్వారా ప్రజలకు, ప్రతి రైతుకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే సిపిఐ ఆధ్వర్యంలో రైతులను కలుపుకొని పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం గిడ్డయ్య, మునెప్ప ఆధ్వర్యంలో 21 మంది సభ్యులతో సిపిఐ మండల సమితిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిపిఐ మండల కార్యదర్శిగా ఎం.గోపాల్, సహాయ కార్యదర్శిగా ఓంకార స్వామి, మండల నాయకులుగా ఎం.రాజు, ఎ.జీవన్, ఎస్.ఈరేష్, రాజేంద్ర, అబ్రహాం, సిద్ధప్ప, లక్ష్మన్నను ఎన్నుకున్నారు.
మాట్లాడుతున్న సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య










