ప్రజాశక్తి-ఆలూరు
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ప్రభుత్వం మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ఆలూరు ఎడిఎ సునీత తెలిపారు. సోమవారం స్థానిక వ్యవసాయ కార్యాలయంలో ఎఒలు, ఎఇఒలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆలూరు సబ్ డివిజన్కు 900 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు మంజూరైనట్లు చెప్పారు. వేరుశనగ పూర్తి ధర క్వింటా రూ.9,300 కాగా 40 శాతం సబ్సిడీతో రూ.5,580 ధర రైతుకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు రాయితీ వేరుశనగ విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తామని చెప్పారు. రైతులు తప్పనిసరిగా పంట మార్పిడి చేసుకోవాలని కోరారు. గ్రామాల్లో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎఒలు వెంకటేశ్వర గౌడ్, శివశంకర్, ఆనంద్, టెక్నికల్ ఎఒ దేవభూషణ కుమార్, ఎఇఒలు విరుపాక్షి, రమాదేవి, మంజనాథ్ గౌడ్ పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఎడిఎ సునీత










