Aug 06,2021 12:09

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఒలింపిక్స్‌ కాంస్యం సాధించిన విజేత పివి.సింధు శుక్రవారం కలిశారు. సింధును సిఎం జగన్‌ అభినందించి సత్కరించారు. ప్రభుత్వం తరపున సింధుకు రూ.30 లక్షల నగదును అధికారులు అందజేశారు. విశాఖలో వెంటనే అకాడమీని ప్రారంభించాలని, రాష్ట్రం నుంచి మరింతమంది సింధులు తయారు కావాలని సిఎం జగన్‌ ఆకాంక్షించారు. అనంతరం సచివాలయ ఆవరణలో పివి సింధు మీడియాతో మాట్లాడుతూ... సిఎం వైఎస్‌ జగన్‌ను కలవడం ఆనందంగా ఉందన్నారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు సిఎం జగన్‌ ఆశీర్వదించారని, ఒలింపిక్స్‌లో మెడల్‌ తీసుకురావాలని కోరారని తెలిపారు. ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌కు 2 శాతం రిజర్వేషన్‌ గొప్ప విషయం అని చెప్పారు. అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయించిందని.. త్వరలోనే అకాడమీ ప్రారంభిస్తానని పివి సింధు పేర్కొన్నారు.