అనుకున్నదొక్కటి అయినదొక్కటి..
బోల్తా కొట్టారు రైతన్నలు..
ప్రజాశక్తి -వెంకటగిరి రూరల్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రీ సర్వే పథకం రైతన్నల్లో నిరాశ కలిగించనుందని గ్రామీణ ప్రాంత వద్ధ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుండో వ్యవసాయ భూములు తమ ఆధీనంలో ఉంటూ రబీ, ఖరీఫ్ మెట్ట పంటలు పండించుకుంటూ తరతరాల నుండి భూములను నమ్ముకుని ఉన్న చిన్న సన్నకారు రైతులు అనాదినం, డి పట్టా, బైనామిల్, సెటిల్మెంట్ భూములను కొనుగోలు చేసిన, వారసత్వంగా ఉన్న, భూములకు ప్రభుత్వ సర్వేయర్ల ద్వారా రీ సర్వే నిర్వహించి వారి పాత రికార్డుల ప్రకారం, ప్రభుత్వం లబ్ధిదారునికి ఇచ్చిన నోటీసులు ప్రకారం భూమికి కొలతలు వేసి సరిహద్దుల్లో ఉన్న రైతులకు ఎలాంటి తగాదాలు లేకుండా ప్రభుత్వ సర్వేయర్లు , వీఆర్వోలు తమ భూములకు తప్పులు లేకుండా కొలతలు వేసి ఈ పాస్ బుక్ ఇస్తారని ఆశపడ్డ చిన్న సన్నకారు రైతులకు నిరాశ కలిగించనుందని ఆయా గ్రామాల్లో ఉన్న రైతన్నలు వాపోతున్నారు. మండలంలో తహశీల్దార్ ఆదేశాలతో సర్వేయర్లు గ్రామీణ ప్రాంతాలకు వచ్చి ఒక ప్రాంతంలో ఉన్న సర్వే నెంబర్లు సంబంధించిన రైతులు ఉన్నా లేకపోయినా వారిష్టానుసారంగా రీ సర్వేలు నిర్వహించి వెళ్లారని, మరొక సర్వేయర్ల టీం వాళ్లు వచ్చి ఇరువైపులా భూములున్న రైతుల సమక్షంలో సర్వే రాళ్లను ఏర్పాటు చేయకుండా ఇరుపక్క రైతులు లేకుండా రాళ్లు నాడడం వల్ల భూ సమస్యలు అధికమయ్యే పరిస్థితి ఉందని రైతులు అంటున్నారు. రైతులకు ముందున్న పాసుబుక్లో ఉన్న సర్వే నంబర్ల విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణం రావడం, లేదా తక్కువ విస్తీర్ణం ఈ పుస్తకాల్లో నమోదు కావడంతో చిన్న సన్నకారు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని సంబంధించిన అధికారులకు తెలిపిన సరైన సమాధానం లేక దాటవేసే దోరణతో మాట్లాడుతున్నారని దీనిపై ఉన్న అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
ఈ పాస్ బుక్ లో రెండు రెట్లు అధిక భూమి
నాకున్న భూమికంటే రెండు రెట్లు అధికంగా ఈ పాస్ బుక్ లో వచ్చింది.. అంతాతప్పుల తడకగావుంది.
- నక్కల గోపాలయ్య, రైతు, పాలకొండ సత్రం.










