Aug 10,2023 23:17

సొసైటీ చైర్‌ పర్సన్ల ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న కత్తెర సురేష్‌ కుమార్‌

మేడికొండూరు: వైసిపి ప్రభుత్వం పారదర్శంగా పని చేస్తోందని, అందరికీ సముచిత న్యాయం చేస్తుందని, అందులో భాగంగానే అన్ని వర్గాలకు పదవులు ఇవ్వడం జరిగిందని తాడికొండ నియోజకవర్గం సమన్వయకర్త కత్తెర సురేష్‌ కుమార్‌ అన్నారు. మండలంలోని మేడికొండూరు, పేరేచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్య క్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు గురువారం జరిగాయి. పేరేచర్ల సొసైటీ అధ్యక్షుడిగా షేక్‌ గాలిబ్‌ షరీఫ్‌, పొట్లపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా పాములపాటి జయరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఇరువురికి నియామక పత్రాలను సురేష్‌ కుమార్‌ చేతుల మీదగా అందజేశారు. సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాలకు పదవుల్లో రిజర్వేషన్‌ అమలు చేయటమే కాకుండా, మహిళలకు కూడా పెద్దపీట వేశారని తెలిపారు.సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం వల్ల బడుగు,బలహీన వర్గాలకు, పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గం చక్కగా పనిచేసే మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కార్య క్రమంలో జడ్పిటిసి కందుల సిద్దయ్య ,ఎంపీపీ మన్నవ స్వప్న ,మండల పార్టీ అధ్యక్షుడు వంశీ, జె సి ఎస్‌ కన్వీనర్‌ అబ్బాస్‌ , తదితరులు పాల్గొన్నారు.