ప్రజాశక్తి-నాతవరం: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలో శృంగారం గ్రామంలో ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ పర్యటించారు. నెల రోజుల కిందట జరిగిన ప్రమాదంలో కాలి గాయం కావడంతో నడవలేని స్థితిలో ఉన్న ఎమ్మెల్యే వీల్ చైర్లోనే ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అన్ని వర్గాల వారిని అన్ని విధాలా ఆదుకోవడమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్నారు. అనంతరం అంగన్వాడి కేంద్రంలో గర్భిణీలకు సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మణమూర్తి, వైస్ ఎంపీపీ సునీల్, జడ్పిటిసి అప్పలనరస, పార్టీ అధ్యక్షులు పైల పోతురాజు, మండల మహిళా అధ్యక్షురాలు కామిరెడ్డి వెంకటలక్ష్మి, స్థానిక సర్పంచు ఎర్రయ్యమ్మ, మాజీ సర్పంచ్.వి.శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు నాయుడు, కార్యకర్తలు పాల్గొన్నారు.
.










