ప్రజాశక్తి - ఆస్పరి
ఆస్పరి మాజీ జడ్పిటిసి బాలకృష్ణ (58) గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఇంట్లో రాత్రి తీవ్ర అనారోగ్యానికి గురికాగా చికిత్స నిమిత్తం ఆదోని ప్రయివేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. మృతుడు బాలకృష్ణకు భార్య, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. 2006లో ఆయన ఆస్పరి జడ్పిటిసిగా విజయం సాధించారు. మండలంలో అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు ఏర్పరచుకుని కలుపుగోలుతనంగా వ్యవహరించేవారు. గత సర్పంచి ఎన్నికల్లో కూడా వారి పంచాయతీ నుంచి తమ్ముడు రాఘవేంద్ర భార్య రాధమ్మను పోటీ చేయించి గెలిపించుకున్నారు. గ్రామంలో కూడా వర్గాలతో మంచి సంబంధాలు ఉండడంతో ప్రజలు కడసారి చూసేందుకు భారీగా తరలి వచ్చారు. బాలకృష్ణ మృతదేహానికి శుక్రవారం రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు శ్రీనివాసులు పూలమాల వేసి నివాళులర్పించారు. సొసైటీ ఛైర్మన్ గోవర్ధన్, జడ్పిటిసి దొరబాబు, వైసిపి మండల కన్వీనర్ పెద్దయ్య, మండల మాజీ కన్వీనర్ రామాంజనేయులు, టిడిపి సొసైటీ మాజీ డైరెక్టర్ కృష్ణ, టిడిపి సీనియర్ నాయకులు తిమ్మన్న, శ్రీనివాస్ గౌడ్, సొసైటీ సిఇఒ అశోక్, నాయకులు తిమ్మప్ప, మోహన్, రంగన్న తదితరులు నివాళులర్పించారు.
నివాళులర్పిస్తున్న గుమ్మనూరు శ్రీనివాసులు










