
- దేశ సౌభాగ్యానికి పిల్లల చదువు అత్యంత కీలకం- డాక్టర్ శంకర శర్మ
ప్రజాశక్తి-కర్నూలు జిల్లాపరిషత్: అనాథ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటు జీవనోపాధి కోసం వారు బాల్యంలోనే పనులు చేయకుండా వారికి చేయూత అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ వైద్యుడు శంకర్ శర్మ అన్నారు. కర్నూలు నగర పరిసర ప్రాంత జగన్నాథ గట్టు సమీపంలో ఉన్న హోమ్ ఆఫ్ హోప్ ఆశ్రమానికి నిత్యావసర సరుకులను డాక్టర్ శంకర్ శర్మ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ బాలలే రేపటి దేశ భవిష్యత్తు అనే వాస్తవాన్ని సమాజానికి వివరించి దేశ సౌభాగ్యానికి పిల్లల చదువు, వారికి సరైన ఎదుగుదల అత్యంత కీలకమని తెలియని వారందరికీ అర్థమయ్యేలా తెలియ జేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉచిత ప్రాథమిక విద్యను అందించడం ద్వారా బడి వయసు బాలలు ఎవరూ విద్యకు, విజ్ఞానార్జనకు దూరం కాకుండా చూడవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.బాల కార్మికుల నిషేధిత చట్టాల గురించి ఆయా సంస్థల యజమానులకు తేలియ చెప్పాల్సిన బాధ్యత మనం మరువకూడదని, బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల మద్దతు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో రోజా సిఆర్పి సుమలత, ఆశ్రమం నిర్వాహకురాలు బ్లెస్సీ, ప్రమీలమ్మ సతీష్లు పాల్గొన్నారు.