ప్రజాశక్తి- కొల్లూరు : అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ బాపట్ల జిల్లా ఉపాధ్యక్షురాలు కామేశ్వరి డిమాండ్ చేశారు. స్థానిక బాబు జగజ్జీవన్ రావ్ కమ్యూనిటీ హాల్లో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సమావేశం బుధవారం నిర్వమించారు. ఈ సందర్భంగా కామేశ్వరి మాట్లాడుతూ ఐసిడిఎస్ పరిరక్షణ, అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పింఛను, పిఎఫ్. ఇఎస్ఐ గ్రాడ్యుటి అమలు చేయాలన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10 కోరికల దినం పాటించి, దేశవ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేయాలని అఖిల భారత కమిటీ పిలుపునిచ్చినట్లు తెలిపారు. గత 48 సంవత్సరాలుగా గర్భిణులకు, బాలింతలకు చిన్న పిల్లలకు సేవలు అందిస్తున్న అంగన్వాడీలకు కనీసం ఉద్యోగ భద్రత లేదన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10,11 తేదీల్లో 36 గంటల పగలు, రాత్రి కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. అగన్వాడీల యూనియన్ గౌరవాధ్యక్షుడు బి. ఆగస్టీన్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు పూర్తయినప్పటికీ అంగన్వాడీ సమస్యల పరిష్కరించలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బి.సుబ్బారావు. బసవమ్మ పాల్గొన్నారు










