Nov 19,2023 00:42

చింతూరులో ధర్నా చేస్తున్న అంగన్వాడీలు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో అల్లూరి జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో కార్యకర్తలు, ఆయాలు శనివారం ర్యాలీలు నిర్వహించారు. ఐసిడిఎస్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించి, అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
ప్రజాశక్తి-చింతూరు

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన అంగన్వాడీలు స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్‌ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యూటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని, అంగన్‌వాడీ టీచర్లతో సమానంగా మినీ వర్కర్లకు ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ 5 లక్షలు ఇవ్వాలని, హెల్పర్ల ప్రమోషన్‌లో రాజకీయ జోక్యం అరికట్టాలని, మెనూ ఛార్జీలు పెంచాలని, పెండింగ్లో ఉన్న సెంటర్ల అద్దెలు, బిల్లులు చెల్లించాలని, 2017 టీఏ బిల్లులు, ఇతర బకాయిలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇచ్చి ఎఫ్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని కోరారు. పై సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే డిసెంబర్‌ 8వ తేదీ నుంచి సమ్మెలో వెళ్తామని హెచ్చరించారు. అనంతరం వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సూపర్వైజర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు సీసం సురేష్‌, సిఐటియు మండల కార్యదర్శి పొడియం లక్ష్మణ్‌, నాయకులు కారం సుబ్బారావు, బీరబోయిన దిలీప్‌, అంగన్వాడీ వర్కర్లు వెంకటరమణ, జయ, వసంత, భద్రమ్మ, పార్వతి, దుర్గ, వీరమ్మ, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
కూనవరం : మండలంలోని భీమవరం ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి కొమరం పెంటయ్య మాట్లాడుతూ తెలంగాణ కన్న అదనంగా వేతనాలు ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల అధ్యక్షులు తాళ్లూరి శ్రీనివాసరావు, ప్రాజెక్ట్‌ అధ్యక్షులు ప్రసన్న, కార్యదర్శి అన్నపూర్ణ, లలిత, అర్జమ్మ, రాణి, వరలక్ష్మి ముత్తమ్మ, అరుణ, సీపీఎం నాయకులు బాబురావు పాల్గొన్నారు.
విఆర్‌.పురం : మండల కేంద్రం రేకపల్లి జంక్షన్‌ నుండి తహశీల్దారు కార్యాలయం వరకు అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా చేశారు. అనంతరం వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దారు శ్రీధర్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పూనెం సత్యనారాయణ, యూనియన్‌ మండల కార్యదర్శి ముసురు రాజేశ్వరి, అధ్యక్షులు గంగమ్మ, జిల్లా నాయకులు సున్నం నాగమ్మ, వర్కర్లు పాల్గొన్నారు.
అడ్డతీగల : అంగన్వాడీ సమస్యలపై సిఐటియు జిల్లా కార్యదర్శి బి నిర్మల ఆధ్వర్యంలో శనివారం సిడిపిఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు జి.బేబీ రాణి, కె.నాగవల్లి, కే సంతోష్‌వాణి, జె చంద్రకళ, లక్ష్మి, అప్పలరాజు, కమల, రామలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.
మారేడుమిల్లి : మండల కేంద్రంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు మినీ అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ మండల అధ్యక్షురాలు నిర్మల కుమారి, కార్యదర్శి ప్రసూన మాట్లాడుతూ ఆర్‌ఎఫ్‌ఎస్‌ రద్దు చేయాలని, మూడు యాప్‌లు కలిపి ఒకే యాప్‌గా మార్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు రాజన్న దొర, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజవొమ్మంగి : సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు శనివారం స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యాలయం వద్ద సాయంత్రం వరకు బైఠాయించారు. ప్రభుత్వం తమ డిమాండ్ల తక్షణం పరిష్కరించాలంటూ నినదించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐసిడిఎస్‌ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పి రామరాజు, యూనియన్‌ జిల్లా నాయకులు కె.వెంకటలక్ష్మి, మండల నాయకులు చిన్ని కుమారి, వి రమణి, బి సుందరమ్మ, హెచ్‌ గడ్డమ్మ, ఎల్‌ సత్యవతి, కె మంగమ్మ, చిన్నమ్ములు, యు రాజేశ్వరి,మేరీ తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడి కార్యకర్తల వినతి
ముంచింగిపుట్టు : మండలంలోని ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సిఐటియు మండల కార్యదర్శి శంకర్రావు ఆధ్వర్యంలో శనివారం అంగన్వాడి కార్యకర్తలతో ఐసీడీఎస్‌ సూపర్వైజర్లకు వినతిని సమర్పించారు. ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అంగన్వాడిల సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పి మాట తప్పారన్నారు.అంగన్వాడి కార్యకర్తలకు, ఆయాలకు, మినీ వర్కర్లకు కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకురాలు సుజాత, బి సత్యవతి, చిలకమ్మ పాల్గొన్నారు.