ప్రజాశక్తి - చిప్పగిరి
జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన విద్యనందిస్తోందని ఆలూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ గుమ్మనూరు నారాయణ తెలిపారు. శనివారం మండలంలోని గుమ్మనూరు అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఒ లలిత, సూపర్వైజర్ ప్రసూన ఆధ్వర్యంలో ప్రభుత్వం సరఫరా చేసిన ఆట వస్తువుల కిట్ల పంపిణీ చేపట్టారు. ముఖ్యఅతిథిగా గుమ్మనూరు నారాయణ హాజరయి మాట్లాడారు. ముఖ్యంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రయివేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపకుండా చిన్నారులను ఆకర్షించేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో ఆట వస్తువులను సమకూరుస్తున్నారని చెప్పారు. పంచాయితీ కార్యదర్శి సురేంద్ర, వైసిపి నాయకులు శ్రీధర్, గుమ్మనూరు చంద్రయ్య, తిరుమలేష్, నారి పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న గుమ్మనూరు నారాయణ










