Nov 13,2023 19:17

నేమకల్లులో మధ్యలో నిలిచిపోయిన అంగన్వాడీ భవన నిర్మాణం

ప్రజాశక్తి - చిప్పగిరి
అంగన్వాడీ భవన నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. గత ప్రభుత్వంలో నిర్మాణం మొదలుపెట్టినా ఈ ప్రభుత్వంలో కూడా పూర్తి చేయలేదు. నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోవడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.
మండలంలోని చాలా గ్రామాల్లో అంగన్వాడీ భవన నిర్మాణాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. మండలంలో 30 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, దాదాపు సగం వరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. సంగాల గ్రామంలో నిర్మాణం పూర్తయినా బిల్లులు రాకపోవడంతో అధికారులు కూడా స్వాధీన పరుచుకోలేకపోతున్నారు. మండలంలోని నేమకల్లు గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో ఎంపిపిగా ఉన్న పాముల పద్మావతి గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. స్థలాలు లేకున్నా ఫిల్టర్‌ వాటర్‌ కోసం కట్టించిన నిర్మాణం దగ్గర స్థలం ఉండడంతో అంగన్వాడీ భవన నిర్మాణం చేపట్టడానికి అన్ని అనుమతులూ మంజూరు చేయించారు. గ్రామంలో ఉన్న గుత్తేదారునితో నిర్మాణం చేపట్టడానికి అనుమతి ఇచ్చారు. గత ప్రభుత్వంలో జరిగిన నిర్మాణం మాత్రమే జరిగిందని గ్రామస్తులు తెలుపుతున్నారు. సంబంధిత గుత్తేదారుని సంప్రదించగా అంగన్వాడీ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రూ.8 లక్షలు మంజూరు చేసిందని, నిర్మాణం చివరి దశకు వచ్చి ఐదేళ్లు కావస్తున్నా తమకు బిల్లులు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణం కోసం అధిక వడ్డీలకు అప్పు చేశామని, ప్రభుత్వం మారినా బిల్లులు మంజూరు కాలేదని తెలిపారు. ఒక ప్రభుత్వంలో చేపట్టిన నిర్మాణాలు మరో ప్రభుత్వంలో ఆగ పోవాల్సిందేనా, బిల్లులైన చెల్లించారా అంటే అది కూడా లేదని గుత్తేదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు మంజూరయితే చివరి దశ పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు.