
ప్రజాశక్తి-హిందూపురం : ట్రినిటీ ఆర్గనైజేషన్, బెంగళూరుకు చెందిన శంకర్ నేత్రాలయ వారు సంయుక్తంగా కలిసి ఉచితంగా అంధత్వ నివారణకు కృషిచేయడం అభినందనీయమని సిఅండ్ ఐజి మిషన్ చర్చి అధ్యక్ష కార్యదర్శులు అనీల్ కుమార్, పాల్ అన్నారు. శనివారం పట్టణంలోని అల్ హి లాల్ పాఠశాల ఆవరణంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి నెల రెండవ శనివారం ట్రినిటీ సర్వీసెస్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్యపరీక్షలు నిర్వహించి చూపు కోల్పోయిన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఈ శిబిరంలో 475 మందికి కంటి పరీక్షలు నిర్వహింగా ఇందులో 155 మందిని శస్త్ర చికిత్సకోసం బెంగళూరుకు తరలిచారు. గత నెల శస్త్ర చికిత్సలు నిర్వహించిన వారికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ ఆర్గనైజేషన్ అధ్యక్ష కార్యదర్శులు కుమార్ రాజా, ఉషారాణి, కంటి వైద్య నిపుణులు డాక్టర్ మాధవి, అసుపత్రి సిబ్బంది, సి అండ్ ఐజి మిషన్ చర్చి పాల్, వాలంటీర్లు రహంతుల్లా తదితరులు పాల్గొన్నారు.