
గుజరాత్కు చెందిన 34 ఏళ్ల సీజల్ దరువాలా ఒక వలస కార్మికురాలు. ప్రస్తుతం ఆమె తన సొంతూరు భారుచ్కి 150 కిలోమీటర్ల దూరంలో జరిగే భవన నిర్మాణ స్థలంలో పనిచేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా సొంతూళ్లకు తిరిగొచ్చిన తమకు పనులు లేక కుటుంబ పోషణకు నానా అవస్థలు పడుతున్నారు. తన ఇద్దరు పిల్లలకు కనీసం రెండు పూటలా సరిపడా తిండి పెట్టేందుకే అంతదూరం పనులకు వెళ్ల్లాల్సి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. లాక్డౌన్ ముందుకన్నా లాక్డౌన్ అనంతర పరిస్థితులు వారి జీవితాలను పూర్తిగా మార్చేశాయని, తమ జీవితాలు దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయని వాపోతుంది. సొంతూళ్లలో లేనికారణంగా ప్రభుత్వ పథకాలు అందుకునేందుకు తమ వద్ద సరైనా ఆధారాలు లేవని, దీంతో ఇటు పనులు లేక.. అటు ప్రభుత్వ పథకాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
***************************
బీహార్ జీనాబాద్కు చెందిన 27 ఏళ్ల బైతా స్వాతాక్ష్ది మరో గాథ.. వలస కార్మికురాలైన ఈమె ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి.. ఈ సమయంలోనూ భవన నిర్మాణాల్లో పనుల కోసం ప్రతిరోజూ 120 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. పోషకాహారం తీసుకోవాల్సిన పరిస్థితుల్లో కనీసం రెండు పూటల భోజనం దొరికితే చాలు అనే పరిస్థితుల్లో ఉంది. పనులు దొరక్కపోతే అదీ ఉండదు. ఒకవేళ దొరికినా వచ్చిన దాంతోనే సరిపెట్టుకుంటున్నానని చెబుతోంది.
సమతుల ఆహారంగానీ, వైద్య సహాయంగానీ ఆమెకు అందుబాటులో లేవు. 'పని ఉన్నరోజు కూలీ రూ.300 గిట్టేది. దాంతో పోషకాహారం తీసుకునే వెసులుబాటు ఉండదు. గర్భం దాల్చిన మూడు నెల్లకే అంగన్వాడీ కేంద్రంలో పేరు రిజిస్టర్ చేసుకున్నా.. ఇంతవరకూ తనకు అందాల్సిన ప్రసూతి నగదు సహాయం అందలేదు' అని చెబుతోంది.
ప్రభుత్వ నిర్లక్ష్యం..
అయితే, ఇదేమంత ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదని విశ్లేషకులు అంటున్నారు. లాక్డౌన్ కారణంగా దేశంలో కోట్లాది మంది మహిళలు, పిల్లలకు ప్రయోజనం చేకూర్చే కీలకమైన ప్రభుత్వ పథకాలకు అంతరాయం కలిగింది.
అంతే కాకుండా, పెద్ద సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలను కరోనా పరిస్థితులను తెలుసుకోవడానికి, దానిపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో నియమించారు. వారంతా ఇంకా పూర్తిగా తమ తమ కేంద్రాలకు తిరిగి రాలేదు. ఈ కారణంగా, కరోనా వల్ల అనేక మారుమూల ప్రాంతాల్లో అంగన్వాడీలు సరిగా పనిచేయడం లేదు. అయితే దేశంలో పోషకాహార లోపం ఎందుకు పెరుగుతోందన్న దానికి ఇది పూర్తి వివరణ కాదు.
పిల్లల్లో పెరిగింది..
ఐదేళ్ల క్రితం కంటే ఇప్పుడు పిల్లలు ఎక్కువ పోషకాహార లోపంతో బాధపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2019-20లో సేకరించిన డేటా ఆధారంగా తాజా నివేదికను తయారుచేశారు.
కోవిడ్ మహమ్మారి వ్యాప్తికి ముందు 22 రాష్ట్రాల్లో మాత్రమే ఈ సర్వే జరిపారు. మిగతా రాష్ట్రాల్లో లాక్డౌన్ ముగిసిన తరువాత సర్వే చేశారు. కాబట్టి ఆ రాష్ట్రాల్లో ఫలితాలు మరింత ఘోరంగా ఉండొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, మారుమూల ప్రాంతాల్లో పోషకాహార సమస్య అంతకుముందు నుంచే ప్రారంభమైందని విశ్లేషకులు అంటున్నారు.
2015-16 సర్వేతో పోలిస్తే పిల్లల్లో పోషకాహార సమస్య బాగా పెరిగింది. ఐదేళ్లకన్నా చిన్న పిల్లల్లో పోషకాహార లోపం 44 శాతం నుంచీ 55 శాతానికి పెరిగింది. బరువు తక్కువ పిల్లల శాతం 7.8 నుంచి 13.4 కు పెరిగింది. చాలామంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పేదవారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. పోషకాహార లోపంతో ఉన్న మహిళలకు పుట్టే పిల్లలు కూడా బలహీనంగానే ఉంటున్నారు. దీనికి కారణం మహిళలకు సరైన పోషకాహారం అందకపోవడమేనని నిపుణులు భావిస్తున్నారు. వలసలు కూడా ఈ పరిస్థితికి ఒక ముఖ్య కారణం అని వారు అభిప్రాయపడుతున్నారు.
దరిచేరని పథకాలు..
సీజల్, స్వాతాక్ష్లాగానే అనేకమంది మహిళలు వలస కూలీలుగా దగ్గర్లో ఉన్న పట్టణాలకు, నగరాలకు వెళుతున్నారు. దీనివల్ల స్థానికంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు వీరు దూరం అవుతున్నారు. ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు లేదా రాష్ట్రానికి ఈ పథకాలు సులువుగా బదిలీ కావడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉండగా.. సీజల్, స్వాతాక్ష్ లాంటి మహిళల విషయంలో అది ఇంకా అమలుకావట్లేదు. గుజరాత్, బీహార్లో మహిళలకు ప్రసూతి, పోషకాహార ప్రయోజనాలు అందించేందుకు మూడు రకాల పథకాలు ఉన్నప్పటికీ పోషకాహార సమస్య అధికంగానే ఉంది.
'ఒక్కోసారి, ఆధార్ కార్డ్ అప్డేట్ కాకపోయినా, బ్యాంక్ ఖాతాల్లో మహిళల కేరాఫ్ అడ్రస్లు లేదా పేర్లు వారి తండ్రుల నుంచీ, భర్తలకు మారకపోయినా వారికి ప్రభుత్వ పథకాలు అందడం లేదు' అని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలన్నా, బ్యాంక్ ఖాతాలకు జతపరచాలన్నా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ పలుమార్లు తిరగాల్సి వస్తోంది. ఈ కరోనా నేపథ్యంలో అన్నిసార్లు తిరగడం కష్టమవుతోందని అనేకమంది, ముఖ్యంగా పేద ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తనకు పుట్టిన నలుగురు పిల్లల్లో ఇద్దరు పోషకాహార లోపాల వల్ల చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారని, ఇప్పుడు పుట్టబోయే బిడ్డ గురించి కూడా బెంగగా ఉందని మహారాష్ట్రకు చెందిన పారుల్ వాపోతోంది.
పోషకాహార లోపం అంటే ?
మంచి ఆరోగ్యం, పనితీరు కోసం శరీరానికి తగిన పోషణ అవసరం. విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు వంటి సూక్ష్మపోషకాలు కూడా మంచి ఆరోగ్యాన్ని నిర్వహించుకోవడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అయితే కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు వంటి సూక్ష్మపోషకాల నుండి మనం ఈ పోషకాల్ని పొందుతాం. శరీరం తగినంత పోషకాల్ని అందుకోకపోతే కలిగే పరిస్థితినే 'పోషకాహార లోపం' అంటారు. ఇది ప్రపంచ సమస్య అయినప్పటికీ, ప్రపంచంలోని సూక్ష్మ పోషకాహార లోపం జనాభాలో దాదాపు సగం భారతదేశంలోనే ఉంది.
ఎన్ఐఎన్ తాజా సర్వేలో వెల్లడి
తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలల పిల్లల్లో ఒమేగా ఆమ్లాలు తక్కువగా ఉంటున్నాయి. మాంసాహారుల్లో కూడా ఈ లోపం కనిపిస్తున్నది. దాదాపు 52 శాతం మంది పిల్లలను ఏదో ఒకస్థాయిలో రక్తహీనత సమస్య వెంటాడుతున్నది. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం బయటపడింది. నాడీ వ్యవస్థ, మెదడు, గుండె పనితీరును మెరుగు పరచడంతోపాటు రోగనిరోధకశక్తిని పెంపొందించే ఒమేగా ఆమ్లాలు లభించే పదార్థాలను పాఠశాల విద్యార్థులు తగినంత తినడం లేదని సర్వే తేల్చింది. బడి పిల్లల్లో ఒమేగా-3 పాలీ అన్ స్టార్టడ్ (పీయూఎఫ్ఏ) ఫ్యాటీ ఆమ్లాలు, డొకోసాహెక్సేనోయిక్ ఆమ్లం (డీహెచ్ఏ), ఎకోసాపెంటానోక్ (ఈపీఏ), అప్లా-లినోలెనిక్ ఆసిడ్ (ఏఎల్ఏ) శాతం తక్కువగా ఉన్నట్టు బయటపడింది.
సాధారణంగా ఏడాది నుంచి 15 ఏళ్ల లోపు పిల్లలు వారానికి కనీసం 200 గ్రాముల చేపలు తినాలి. కానీ, ఎక్కువ మంది నెలకు వంద గ్రాముల చేపలు మాత్రమే తింటున్నారు. గుడ్డు తినే అలవాటున్న పిల్లలు కూడా వారానికి కేవలం ఒకే ఒక్క గుడ్డు తింటున్నట్టు సర్వేలో వెల్లడయ్యింది.
52 శాతం మందిలో రక్తహీనత
తెలుగు రాష్ట్రాల్లో సర్వేలో పాల్గన్న విద్యార్థుల్లో 76 శాతం మంది బీఎంఐ (బాడీ మాస్ ఇండక్స్) సాధారణంగానే ఉంది. 17 శాతం మంది తక్కువ బరువుతో, 7 శాతం మంది అధికబరువుతో బాధపడుతున్నారు. 16.4 శాతం మంది వయసుకు తగినంత ఎత్తు లేరు. దాదాపు 52 శాతం మందిని ఏదో ఒక స్థాయిలో రక్తహీనత సమస్య వెంటాడుతోంది. రక్తహీనత 30 శాతం మందిలో స్వల్పంగా, 21 శాతం మందిలో మధ్యస్థంగా, 2 శాతం కంటే తక్కువ మందిలో తీవ్రంగా ఉన్నట్టు సర్వే ద్వారా తేలింది. 48 శాతం మందిలో రక్తహీనత లేదని వెల్లడయ్యింది.
వీరికి పౌష్టికాహారం ఇలా..
పిల్లలకు ఏడు నెలల నుంచి జావలు, కూరగాయలు, పండ్లు గుజ్జుగా చేసిన ఆహార పదార్థాలను రోజుకు రెండుసార్లు 250 మిల్లీ లీటర్ల చొప్పున అందజేయాలి. 11 నెలల లోపు చిన్నారులకు ఆహారం గుజ్జుగా చేసి, రోజుకు మూడు దఫాలుగా 250 మిల్లీలీటర్ల చొప్పున అందించాలి. శరీరం పెరుగుదలకు, గుండె పని, శరీర ఉష్ణోగ్రత మొదలైనవాటికి తగినట్లు ఆహారం అందిస్తూ ఉండాలి. విటమిన్ ఎ లోపం వలన రేచీకటి, కార్నియల్ క్యూరోసిస్ వ్యాధుల నివారణకు పాలు, పాలపదార్థాలు, ఆకు కూరలు, పసుపు పచ్చ కూరగాయలు, క్యారెట్, గుమ్మడి తీసుకోవాలి. ఇనుము లోపం వలన వచ్చే అనేమియా వ్యాధి నివారణకు ఎర్రటి మాంసం, గుడ్లలోని పసుపు, ధాన్యాలు, ఆకుకూరలు, శనగలు, నువ్వులు, చిక్కుళ్లు, పప్పులు, బెల్లం, డ్రై ప్రూట్స్, మొలకెత్తిన పప్పుధాన్యాలు తీసుకోవాలి. అయోడిన్ లోపంతో వచ్చే గ్రంథివాపు వ్యాధి నివారణకు అయోడిన్ ఉన్న ఉప్పును మాత్రమే ప్రతిరోజూ తీసుకోవాలి. సీఫుడ్ స్వీకరించాలనే ప్రచారం ఐసీడిఎస్ చేయనుంది.
అంతర్జాతీయ నివేదికలు...
ప్రపంచ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం... గతం కన్నా మన దేశంలో పోషకాహార లోపం పెరిగిపోయింది. ఈ నివేదిక ప్రకారం మనదేశంలో బాలలు వయసుకు తగ్గ ఎత్తు, బరువు ఉండటం లేదు. ముఖ్యంగా గడిచిన 20 సంవత్సరాల్లో ఈ అసమానత ఏకంగా 10 శాతం పెరిగిందని నివేదిక తెలిపింది. ప్రపంచంలోని 90 దేశాల్లో 400కు పైగా సర్వేల ద్వారా విశ్లేషణ చేస్తే, చాలా పేద దేశాల కన్నా కూడా భారత్లో బాలల పరిస్థితి దయనీయంగా ఉందని నివేదిక పేర్కొంది.
అంతర్జాతీయ నివేదికల నుంచి దేశీయ సూచీల వరకూ అన్నీ దేశంలో నెలకొన్న ఆహారోత్పత్తుల కొరతను స్పష్టం చేస్తూనే ఉన్నాయి. అయినా ఆసియాలోనే అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నామని, త్వరలో చైనాను అధిగమించే సత్తా మనకు ఉందని ఊహాజనితమైన భవిష్యత్తును ఆవిష్కరించే ప్రయత్నాలను మోడీ ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉంది. దేశ జనాభా (130 కోట్లు) లో 14 శాతం మంది పౌష్టికాహార లేమితో బాధపడుతున్నారు. 15 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసున్న మహిళల్లో 34.7 శాతం మంది రక్తహీనతతో అల్లాడుతున్నారు. అత్యధికులు ఆరోగ్యపరమైన సమస్యలతో సతమత మవుతున్నారు. పౌష్టికాహార లేమి కారణంగా మరణిస్తున్న తల్లులు, బిడ్డల సంఖ్య కూడా ఎక్కువే ఉంది.
ఇటీవలనే 'హంగర్ వాచ్' సంస్థ దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలలో 3,994 మందిని కలిసి నిర్వహించిన సర్వేలో కలచివేసే అంశాలు వెలుగులోకి వచ్చాయి. అట్టడుగు వర్గాలలో ఆకలి మహమ్మారి తిష్టవేసుకు కూర్చుందని తెలిపింది. లాక్డౌన్ విధించడానికి ముందుకంటే.. సెప్టెంబర్-అక్టోబర్ 2020లో తీసుకునే ఆహారం తగ్గింది. తినే తిండిలో పోషక విలువలూ క్షీణించాయి. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా ఖాళీ కడుపుతోనే నిద్రకు ఉపక్రమించాల్సిన పరిస్థితిలో మార్పేమీ రాలేదు. షెడ్యూలు కులాలు, షెడ్యూలు తరగతులు, మైనారిటీ తెగలకు కేవలం నెలకు రూ.5 వేల లోపు ఆదాయం ఉంటుంది. వీరివి అత్యంత దయనీయ గాథలు. లాక్డౌన్ ముగిసినప్పటికీ అధికశాతం కుటుంబాల ఆదాయం 62 శాతం తగ్గింది.
అల్పాదాయం.. నిరుద్యోగం.. అసమానతలు..
నిరుద్యోగ సమస్య కోట్లాది మందిని కనీస అవసరాలకు దూరం చేసి, పేదరికంలోకి నెట్టింది. ఫలితంగా ఆకలితో అలమటిస్తున్నారు. ఆకలి అంటే మనిషిని శారీరకంగా, మానసికంగా హింసించే అతి క్రూరమైన జబ్బు. దాని తీవ్రత అనుభవించిన వారికే తెలుస్తుంది. ఆకలి సమస్య ఎక్కువగా పీడిస్తున్న 117 దేశాలలో మనదేశం 102వ స్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఒ), ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ (ఐఎఫ్ఎడి), యునైటెడ్ నేషన్స్ అంతర్జాతీయ చిల్డ్రన్ అత్యవసర నిధి (యుఎన్ఐసిఇపి), యు ఎన్ ఫుడ్ ప్రపంచ ప్రోగ్రామ్ (డబ్య్లుఎఫ్పి), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్ఓ) సంయుక్తంగా ప్రచురించిన నివేదిక పేర్కొంది. ఈ నివేదిక భారత్లో ఆకలి, అర్ధాకలితో అల్లాడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు ప్రకటించింది. ఎఫ్ఎఒ నివేదిక-2020 ప్రకారం మనది ఆకలితో ఉన్న రాజ్యమే.
అల్పాదాయం, నిరుద్యోగం వ్యవసాయం ప్రధానంగా ఉన్న ఆర్థికవ్యవస్థలో, ఆర్థిక అసమానతలు, వనరుల అల్ప వినియోగం. అల్ప వేతనాలు, పౌర భాగస్వామ్య లోపం, సంక్షేమ పథకాల వైఫల్యం లాంటి అంశాలు పేదరికానికి ప్రధాన కారణమని దారిద్య్రరేఖను నిర్వచించిన ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. వీటన్నింటికి తోడు ఇటీవల కరోనా విపత్తు పేదరికానికి మరింత ఆజ్యం పోసిందని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మనదేశంలో మెజార్టీ మధ్యతరగతి కుటుంబాల్లో ఇంటి పెద్ద సంపాదనే కుటుంబ సభ్యులందరికీి ఆహార సముపార్జనకు సాధనం. ఆయనే ఉపాధి కోల్పోవడం లేదా మరణిస్తే పేదలతో పాటు ఆ కుటుంబాలు సైతం ప్రభుత్వ రేషన్తో కాలం గడిపే పరిస్థితి నెలకొంది. చాలా కుటుంబాలు ఆకలి, అర్ధాకలితో పోషకాహార లోపం. ఆరోగ్య సమస్యలతో రోడ్డున పడ్డారు. ఇది వారి ఆహార, ఆరోగ్య సంరక్షణపై తీవ్ర ప్రభావం చూపింది.
గత సంవత్సరం మార్చిలో అనాలోచితంగా, ముందస్తు చర్యలు తీసుకోకుండా లాక్డౌన్ ప్రకటించడంతో వలస కార్మికుల సమస్యలు వర్ణనాతీతం. 'ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధేశం మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికి రోజూ 2200 క్యాలరీలు, పట్టణాల్లో 2100 క్యాలరీలకు సమానమైన ఆహారముండాలి. కానీ గ్రామీణ ప్రాంతంలో 41 శాతం, పట్టణ ప్రాంతంలో 53 శాతం మందికి మాత్రమే లభిస్తున్నాయి. ఆర్థిక సరళీకరణల నేపథ్యంలో ప్రభుత్వాలు ఆర్థిక సంస్కరణలకు తెరదీశాయి. ప్రైవేటు, కార్పొరేట్ వ్యవస్థలకు పెద్దెత్తున ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించాయి. ఇదంతా సాధారణ ప్రజల సొమ్ము. ఇది మొత్తం ప్రైవేటు, కార్పొరేట్ వ్యవస్థల గుప్పెట చేరింది. ప్రజలు అనాథలుగా మిగిలారు.
యుఎన్ లక్ష్యాలకు దూరంగా ప్రభుత్వ ఆచరణ
పేదరికాన్ని 2030 నాటికి అంతం చేయాలనే ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా మన ప్రభుత్వ కృషి నత్త నడకను తలపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 15.5 కోట్ల మంది తీవ్రమైన ఆకలి సమస్యల్లో చిక్కుకున్నారని ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడించింది. ప్రతి నిమిషానికి 11 ఆకలి చావులు నమోదవుతున్నాయనే నివేదిక సారాంశమే దీనికి నిదర్శనం. అయినా యుద్ధాలు, అంతర్యుద్ధాల కోసం పాలకులు భారీ మొత్తంలో మారణాయుధాల కోసం నిధులు ఖర్చు చేస్తున్నారు. కరోనా సంక్షోభ సమయంలోనూ, ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ ఖర్చు 51 బిలియన్ డాలర్లు (సుమారుగా రూ.3.6 లక్షల కోట్లు) పెరిగిందని ఆక్స్ఫామ్ నివేదిక తెలిపింది. 2020లో జనాభా వృద్ధి స్థాయిని మించి ఆకలి సమస్య పెరిగిపోయిందని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది.
చిన్నపిల్లల ఆరోగ్యంపై చేసే ఖర్చు తక్కువ
ఇతర దేశాలతో పోలిస్తే దేశంలో ఆరోగ్యంపై చేసే ఖర్చు, మరీ ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యంపై చేసే ఖర్చు చాలా తక్కువ. దేశ జీడీపీలో 1.2 శాతం ఆరోగ్యంపై కేటాయిస్తుంటే చైనా 2.7 శాతం, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలు 3.8 శాతం కేటాయిస్తున్నాయి. ప్రపంచ సగటు 6.5 శాతంతో పోలిస్తే భారత్ ఆరోగ్యంపై కేటాయించేది చాలా తక్కువ. ఫలితంగా ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో శిశుమరణాల రేటు, పోషకాహర లోపం ఎక్కువగా ఉంది.
రోజువారీ ఆహార ప్రణాళిక
రోగ నిరోధకశక్తిని పెంపొందించే ఆహారం చాలా ముఖ్యం. అన్నం, పప్పు, కూరతో ముగించకుండా.. ఎనిమిది రకాల పదార్థాలు మన భోజనంలో భాగం కావాలి. రోజువారీ ఆహారంలో 350 గ్రాముల కూరగాయలు, ఆకుకూరలు, 150 గ్రాముల పండ్లు, 90 గ్రాముల పప్పులు / మాంసాహారం, 30 గ్రాముల డ్రైఫ్రూట్స్, గింజలు, 27 గ్రాముల నూనెలు, బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు 240 గ్రాములు, పాలు / పెరుగు 300 మిల్లీలీటర్లు ఉండేలా చూసుకోవాలి.
ఈ పథకాలను బలోపేతం చేయాలి
పేద పిల్లలకు పోషకాహరం సరఫరా చేయడంలో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్), మధ్యాహ్న భోజన పథకాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. కొన్నేళ్లుగా ఈ పథకాలకు ఆశించిన నిధులు కేటాయించడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలే ఈ పథకాలను అమలుచేస్తున్నా.. మిగిలిన రాష్ట్రాల్లో దయనీయమైన పరిస్థితి ఉంది. కేంద్రప్రభుత్వం ఈ పథకాలను బలోపేతం చేసి, సమర్థవంతగా అమలు చేస్తే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
- ఉదయ్ శంకర్ ఆకుల, 79897 26815