
పుట్టపర్తి రూరల్ : ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సర్వే పరీక్షల ద్వారా గుర్తించిన ప్రజలకు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మరింత మెరుగైన వైద్యం అందించనున్నట్లు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. పుట్టపర్తి మండల పరిధిలోని జగరాజుపల్లి గ్రామంలో పైలట్ పోగ్రామ్గా ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో ఏర్పాటుచేసిన పలు విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష పై ప్రజలకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలాగే వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్న వైద్య శిబిరంలో ఎదురయ్యే లోటుపాట్లను గుర్తించి ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డా||కృష్ణారెడ్డికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాగ్యరేఖ, డిసిహెచ్ఎస్ డా||తిపేంద్ర నాయక్, మండల స్పెషల్ ఆఫీసర్ డా||శుభదాస్, ఎంపీపీ రమణారెడ్డి, సర్పంచి లక్ష్మీనరసమ్మ, తహశీల్దార్ నవీన్, ఎంపీడీవో అశోక్, జెడ్పీటీసీ లక్ష్మీనరసమ్మతో పాటు వివిధ శాఖల అధికారులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.