
ప్రజాశక్తి -భీమునిపట్నం : డాక్టర్ బిఆర్.అంబేద్కర్ను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ఆర్ఎస్ఎస్ కార్యకర్త అమరప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ పలువురు దళితులు ఆదివారం నిరసన తెలిపారు. స్థానిక ఎఎంసి యార్డు ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యాన చేపట్టిన నిరసననుద్దేశించి కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాగం లక్ష్మి, దళిత సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర నాయకులు భాగం గోపాలరావు మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా నేటికీ దళితులపై దాడులు హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తపై ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ప్రతినిధులు బి.ఈశ్వర్కుమార్, బి.నరసింగరావు, పి.నరసింగరావు, మాజీ సర్పంచ్ జి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.