* 4 వారాల్లో విచారణ పూర్తిచేయాలని హైకోర్టుకు 'సుప్రీం' ఆదేశం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అమరావతి భూముల వ్యవహారానికి సంబంధించి మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్పై ఎపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంది. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసే ఉద్దేశంలో ఉన్నామని తెలిపింది. రాజధాని భూములు కొనుగోళ్ల కేసుల విషయంలో దమ్మాలపాటి శ్రీనివాస్ తదితరులపై సిట్ విచారణను నిలిపివేస్తూ ఎపి హైకోర్టు ఇచ్చిన స్టే, గ్యాగ్ ఆర్డర్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గురువారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేష్ మహేశ్వరితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది మహపూజ్ నజ్కీ దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో ధర్మాసనం పిటిషన్ కొట్టివేస్తున్నామని, సవరించిన పిటిషన్ను హైకోర్టు పరిగణనలోకి తీసుకొని నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాలని పేర్కొంది.