
ప్రజాశక్తి-కలెక్టరేట్, విశాఖ : దిల్వాలా మూవీ అన్ని తరగతుల ప్రేక్షకులను అలరిస్తుందని నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ అన్నారు. టర్నర్ చౌట్రీలో ఈ మూవీకి సంబంధించి షూటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించింది. ఈ మూవీలో ప్రధాన పాత్రను పోషిస్తున్న నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, క్రైమ్ -కామెడీ మిళితమైన కథాంశంతో ఈ మూవీని రూపొందిస్తున్నట్లు చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత ఒక మంచి సినిమాలో చేస్తున్న అనుభూతి కలుగుతుందన్నారు. తన పాత రోజులు గుర్తుకు వచ్చాయని చెప్పారు. 15 రోజులుగా ఈ మూవీ ఏకదాటిగా విశాఖలో షూటింగ్ జరుగుతుందని తెలిపారు. ఈ మూవీలో సరికొత్త రాజేంద్రప్రసాద్ను ప్రేక్షకులు చూస్తారని చెప్పారు.
డైరెక్టర్ వీరభద్రచౌదరి మాట్లాడుతూ ఈ మూవీ మొదటి షెడ్యూల్ను హైదరాబాదులో పూర్తిచేసినట్లు తెలిపారు. విశాఖలో రెండో షెడ్యూల్ ప్రారంభించామని చెప్పారు. సీనియర్ నటులు డాక్టర్ రాజేంద్రప్రసాద్తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్ చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే షూటింగ్ పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో నిర్మాత నరసింహ, ఎంపీ ఎంవివి సత్యనారాయణ, పాల్గొన్నారు.