ప్రజాశక్తి-సీతమ్మధార : ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్, ఎస్పి బాలు సంగీత సేవా ట్రస్ట్ ఆధ్వర్యాన శనివారం విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన సినీ సంగీత విభావరి ఆద్యంతం అలరించింది. కెఎస్.ప్రకాష్, భాగ్యలక్ష్మి పాడిన మురిపించే అందాలే.. రమేష్ పట్నాయక్, ఎం.రమణి పాడిన కురిసేను విరిజల్లులే, బొమ్మిడి సత్యనారాయణ, సీవీ రాజేశ్వరి పాడిన అబ్బో నీ రేగు పళ్లు, మహ్మద్ ఖాన్, శైలజ మీరాజ్ పాడిన అరె ఏమయిందీ, ఎస్ఎస్ఎన్ రాజు, సాత్విక పాడిన నీ చూపులోన, బంగార్రాజు, సావిత్రి పాడిన రాగం తీసే కోయిలా, లిఖిత పాడిన విరిసినది వసంత గానం, రమణి పాడిన గోరు వెచ్చని సూరీడమ్మా వంటి ప్రజాధరణ పొందిన గీతాలు ప్రేక్షకుల్ని కట్టి పడేశాయి. ఈ సందర్భంగా విశాఖ సంగీత కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మహ్మద్ ఖాన్ మాట్లాడుతూ ఘంటసాల, ఎస్ఫి బాల సుబ్రహ్మణ్యం సంగీత ప్రపంచంలో ధ్రువతారలని అభివర్ణించారు. ఎపి టెక్నాలజీస్ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ, ఘంటసాల, ఎస్పి బాలును స్మరించుకోవడం సంతోష దాయకమన్నారు. చెన్నా తిరుమలరావు నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో కళా సంస్థల ప్రతినిధి కొణతాల రాజు, ఎస్పీ బాలు సంగీత సేవా ట్రస్ట్ అధ్యక్షులు మధుపాడ రమణి, సీనియర్ అడ్వకేట్ ఎస్ఎస్ఎన్.రాజు, జెఎంఆర్ నెహ్రూ, ఎస్.ఫణిస్వామి, ఎమ్మెస్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.










