
ప్రజాశక్తి-మాడుగుల: మోదకొండమ్మ పండగ సందర్భంగా మాడుగులలో నిర్వహిస్తున్న ఆహ్వాన పరిషత్ నాటికలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మంగళవారం బ్రహ్మం ఫౌండేషన్ (విశాఖ) ఇది కధ కాదు నాటిక, పిఠాపురం మణికంఠ ఆర్ట్స్ కొత్తతరం కొడుకు నాటికలు రక్తి కట్టించారు. అత్యాశతో ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలో పెట్టుబడి పెట్టి మోసపోయి చివరికి భార్యా పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడటం, కుటుంబ సభ్యులను కోల్పోయి తండ్రి పడే అవేదన కళ్ళకు కట్టినట్టు ప్రదర్శించారు. బంగారు నంది గ్రహీత, జర్నలిస్ట్ ఎస్.డేవిడ్ రాజు రచన, దర్శకత్వం వహించగా రమణ, కుమారి( మాడుగుల), నూకరాజు, రాజు, మదీనా, విజరు సాయి నటించగా సంగీతం గణేష్ అందించారు. అనంతరం పిఠాపురం మణికంఠ ఆర్ట్స్ చెలికాని వెంకటరావు దర్శకత్వంలో ప్రదర్శించిన కొత్తతరం కొడుకు నాటిక ప్రేక్షకుల కంటి నీరు తెప్పించింది. తల్లి మరణంతో ఒంటరిగా వున్న తండ్రిని విదేశాలకు తీసుకు వెళ్లేందుకు కొడుకు పడే తపన, తండ్రి, కొడుకు మధ్య అనుబందం, ప్రేమ అలరించాయి. ఈ నాటికలో నటీనటులు పోటీ పడి మరీ నటించారు. తండ్రి పాత్రలో ఊమా శంకర్, తల్లి పాత్రలో ఉమా మహేశ్వరి, కొడుకు పాత్రలో రాజ రిషి, పనివాడి పాత్రలో నగబట్ల రఘు ల నటన అలరించింది.