
ప్రజాశక్తి - విజయవాడ అర్బన్ : విజయవాడ నగరంలో ఆర్ట్ స్థాయిని మోడ్రనైజ్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో నగరానికి చెందిన ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, జాషువా సాంస్కతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనుపోజు జయశ్రీ ప్రభాకర్ డిజిటల్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి సిద్ధార్ధ మహిళా కళాశాల డైరెక్టర్ డాక్టర్:టి.విజయ మహాలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు...సభని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని చిత్రకారులు చేస్తున్న అద్భుతాలు వర్ణణాతీతమన్నారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా పదికి పైగా పెయింటింగ్స్ అమ్ముడు పోవటం ద్వారా సరికొత్త రికార్డును ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ టీం లిఖించిందని అభినందించారు. డిజిటల్ పెయింటింగ్ కాంటెస్ట్లో చిన్నారులు చూపిన ప్రతిభ అమోఘమన్నారు. అనంతరం ఆత్మీయ అతిథిగా హాజరైన మాకినేని బసవపున్నయ్య విజ్జాన కేంద్రం ప్రతినిధి బి.ఆర్.తులసీరావు మాట్లాడుతూ ప్రస్తుత జనరేషన్ పిల్లలకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని సాంకేతికతో వారు తమ రెగ్యులర్ స్టడీస్కి సంబంధించిన ప్రోజెక్ట్ వర్క్స్ చేసుకోవచ్చని అన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా హాజరైన ఇన్నర్ వీల్ క్లబ్ మిడ్ టౌన్ ప్రెసిడెంట్ హరితా చౌదరి, జిజ్ఞాస ఇంటర్ఫేస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ భార్గవ్ ది ఇండియన్, ఎలిమెంట్ స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ డైరెక్టర్ పాలడుగు మహేష్లు చిన్నారులు డిజిటల్ పెయింటింగ్ నైపుణ్యాన్ని కొనియాడారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ముందుగా సీనియర్ చిత్రకారులు అనుపోజు జయశ్రీ ప్రభాకర్ని ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ ఘనంగా సత్కరించారు, అనంతరం డిజిటల్ పెయింటింగ్ కాంటెస్ట్కి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఉప్పరాపల్లి వేణుగోపాల్, గిరిధర్ అరసవల్లి లకు ప్రత్యేక జ్ఞాపికలను అందజేసారు, అనంతరం డిజిటల్ పెయింటింగ్ కాంటెస్ట్లో గెలుపొందిన విజేతలకు ప్రసంశా పత్రాలను జ్ఞాపికలను అతిథుల చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమానికి ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ కన్వీనర్ సునీల్ కుమార్ అనుమకొండ, జాషువా సాంస్కతిక వేదిక ప్రధాన కార్యదర్శి గుండు నారాయణరావులు పర్యవేక్షించగా కోకన్వీనర్ గిరిధర్ అరసవల్లి, కార్యక్రమ నిర్వాహకుడు స్ఫూర్తి శ్రీనివాస్, కోఆర్డినేటర్ ఎస్.పి.మల్లిక్,సుబ్బు ఆర్వీ, మహిళా విభాగం అధ్యక్షురాలు ఆమ్రపాలి, సంధ్యారాణి, సుధారాణి, స్వాతి పూర్ణిమ, వర్కింగ్ కమిటీ మెంబెర్స్ రమేష్ అర్కాల, శ్రావణ్ కుమార్, అనిల్ డ్యానీ లతో పాటు పలువురు సీనియర్ చిత్రకారులు యువ చిత్రకారులు పాల్గొన్నారు.