
ప్రజాశక్తి -మధురవాడ : అంతరించిపోతున్న అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లను కాపాడుకోవాలని, అందుకే అటవీశాఖ ఆధ్వర్యాన ఆర్కె.బీచ్, జోడుగుళ్ళపాలెం, సాగర్నగర్, చేపలుప్పాడ, పెదనాగమయ్య ప్రాంతాల్లో సంరక్షణా కేంద్రాలను ఏర్పాటుచేశామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బి.రామనరేష్ తెలిపారు. సాగర్నగర్లోని తాబేలు సంరక్షణ కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. వేకువ జామున తాబేళ్ళు తీరంలో పెట్టిన గుడ్లను సేకరించి వాటిని ప్రత్యేకించి పొదిగించి మళ్ళీ సముద్రంలో విడిచిపెడతామని చెప్పారు. అటవీశాఖతో పాటు ప్రభుత్వరంగ, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ఈ అరుదైన తాబేళ్ళుకు జీవం పోస్తున్నాయని తెలిపారు. ఇవి అంతరించి పోకుండా జిల్లా వ్యాప్తంగా వాలంటీర్లను నియమించి గుడ్లను సేకరించి ఇసుక తిన్నెల్లో సంరక్షిస్తున్నట్లు చెప్పారు.