
ప్రజాశక్తి -కంచరపాలెం : ఎన్ఎడి జంక్షన్ వద్ద గల హస్మీ భవన్లో ఆల్ పెన్సనర్స్ అండ్ రిటైర్డ్ పర్సనర్స్ అసోసియేషన్ జిల్లా సమావేశం గురువారం బిటి మూర్తి అద్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఏడాది డిసెంబర్ 17న కూర్మన్నపాలెంలోని స్టీల్ప్లాంట్ కార్మికుల దీక్షా శిబిరం వద్ద చేపట్టిన పెన్షనర్స్ డేని విజయవంతం చేసిన అందరికీ అభినందనలు తెలియజేశారు. ప్రధాన కార్యదర్శి హుస్సేన్ మాట్లాడుతూ, ఢిల్లీలో చేపట్టిన ధర్నా గురించి వివరించారు. సంఘం అధ్యక్షుడు దీనబందు మాట్లాడుతూ, కోర్టు తీర్పును అమలుచేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని విమర్శించారు. కార్పోరేట్లకు రూ.లక్షల కోట్లు మాఫీ చేస్తున్న ప్రభుత్వ తీరును ఎండగడుతూ మాట్లాడారు. రాష్ట్ర కార్యదర్శి కె.సుధాకర్ మాట్లాడుతూ, కనీస పెన్షన్ రూ.9000తోపాటు డిఎ అందరికీ ఇవ్వాలని డిమాండ్చేశారు. సంఘం బలోపేతానికి తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఇతర సంఘాలని కలుపుకొని విస్తరించాలని కోరారు. హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.