బహుమతులను అందజేస్తున్నజెడ్పి చైర్మన్
అఖిల-భారత క్విజ్ విజేతలు వీరే..
నెల్లూరు :పాఠశాల స్థాయిలో 8,9,10 తరగతి విద్యార్ధులకు ఆర్థిక అక్షరాస్యతను అందించాలన్న ప్రధాన లక్ష్యంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ జి-20 ఈవెంట్ కార్యక్రమంలో భాగంగా 'ఆర్థిక అక్షరాస్యతపై పాఠశాల పిల్లలకు అఖిల-భారత క్విజ్'ను మండల స్థాయిలో ఈ నెల 21వ తేదిన నిర్వహించింది.ఈ పోటీలల్లో 74 మంది విద్యార్ధులు అత్యంత ప్రతిభను కనపరిచారు. వీరందరికీ బుధవారం దర్గామిట్ట ప్రాంతంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలల్లో ప్రధమ బహుమతిని ఏఎస్ పేట ప్రాంతం శ్రీకొలను ప్రాంతం జెడ్పిహెచ్ఎస్ పాఠశాలకు చెందిన ఎన్ జ్యోత్స్న,టి.ప్రవీణ్కుమార్లు కైవసం చేసుకున్నారు. ద్వితీయ బహుమతిని అనంతసాగరం మండలం, చిలకలమర్రి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలకు చెందిన కె.జ్ఞానేష్, వై.హారికలు సొంతం చేసుకున్నారు.తృతీయ బహుమతిని టి.పి గూడూరు జెడ్పిహెచ్ఎస్ పాఠశాల విద్యార్ధులు సిహెచ్ విజ్ఞాన జోషిక, ఓ. జిషిత లు దక్కించుకున్నారు. ఈ క్విజ్ పోటీలలో పాల్గొన్న విద్యార్ధులందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు అందజేశారు. ప్రథమ బహుమతి పొందిన జట్టుకు రూ.10 వేలు, ద్వితీయ బహుమతి పొందిన జట్టుకు రూ.7,500లు, తృతీయ బహుమతి పొందిన జట్టుకు రూ.5వేలు నగదు బహుమతిని ఆర్బిఐ అధికారులు విద్యార్ధుల బ్యాంకు ఖాతాకు జమచేశారు. మొదటి బహుమతి అందుకున్న జట్టు విద్యార్ధులు జూలై 14వ తేదిన జరిగే రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీలో పాల్గొనాల్సి ఉంది. జిల్లా స్థాయి క్విజ్ పోటీలలో ప్రతిభను కనపరిచిన జట్లకు సర్టిఫికేట్లను జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, జెడ్పి చైర్మన్ ఆనం అరుణమ్మలు అందజేశారు. ఈ పోటీలు కలెక్టర్ హరి నారాయణన్ ఆదేశాల మేరకు కెనరా బ్యాంక్ లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ టి.శ్రీకాంత్ ప్రదీప్కుమార్, డిఈఒ గంగా భవానీ, సమగ్ర శిక్ష ఏపీసి ఉషారాణిలు నిర్వహించారు.










