ప్రజాశక్తి-విజయవాడఅర్బన్: నగర వాసులకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఏర్పాటుచేసిన ఎస్ ఆర్ అండర్ వాటర్ టన్నెల్ ఎక్స్పో ఈనెల 29వ తేదీతో ముగియనుందని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటి వరకు దుబారు, మలేషియా, సింగపూర్ ప్రాంతాలకే పరిమితమైన వాటర్ టన్నెల్ ఎక్స్ పో విజయవాడ నగరవాసులను ఎంతగానో ఆకర్షిస్తోందన్నారు. బందర్ రోడ్డు ఎ కన్వెన్షన్ రోడ్ వజ్ర గ్రౌండ్స్లో ఎస్ఆర్ అండర్ వాటర్ టన్నెల్ ఎక్స్పో విజయవంతంగా సాగుతోంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు కార్తికేయ శ్రీనివాస్, మహ్మద్ షమ్మి, అడపా ప్రభాకర్ మాట్లాడుతూ ఎస్ఆర్ అండర్ వాటర్ టన్నెల్ పేరిట ఏర్పాటు చేసిన ఎక్స్పోలో కనీవినీ ఎరుగని రీతిలో రంగు రంగుల చేపలతో ఈ ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంతోందన్నారు. టన్నెల్లో 250 కిలోల చేప మాత్రం ఈ ఎగ్జిబిషన్కే ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పాటు చూపుతిప్పుకోకుండా చేస్తోందన్నారు. జెయింట్ వీల్, కొలంబస్, టోరాటోరా, బ్రేక్ డ్యాన్స్, చిన్న పిల్లల ఆటవస్తువులు ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఇటు చిన్నారులు, అటు పెద్దవారికి ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచుతున్నాయని తెలిపారు.










