
ప్రజాశక్తి-తెనాలిరూరల్ : ఎఆర్ కృష్ణ, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయస్థాయి రంగస్థల పురస్కారం పేరుతో కొత్తపేట రామకృష్ణకవి కళాక్షేత్రంలో జరుగుతున్న పద్యనాటిక పోటీలు ఆదివారం 3వ రోజుకు చేరుకున్నాయి. వీణ అవార్డ్స్ 2023 పేరుతో కళల కానాచి తెనాలి, వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ సంయుక్తంగా ఈ పోటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సినీ దర్శకులు బుర్రా సాయి మాధవ్ సారథ్యంలో నిర్వహిస్తున్న పద్యనాటిక పోటీలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. అక్టోబర్ 24 వరకూ ప్రదర్శనలు ఉంటాయని నిర్వహకులు తెలిపారు. ప్రదర్శనలో భాగంగా ఆదివారం టిబిఆర్ ఆర్ట్స్ థియేటర్ హైదరాబాద్ వారి 'స్వామి అయ్యప్ప' (పద్య నాటకం), కుమార రామ భీమేశ్వర నాట్యమండలి కాకినాడ వారి 'నర్తనశాల' (పద్య నాటకం), అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి 'ఆంధ్రప్రస్తం' (సాంఘిక నాటకం), సిరిమువ్వ కల్చరల్స్ హైదరాబాద్ వారి 'మాట్లాడుకుందాం' సాంఘిక నాటకాలను ప్రదర్శించారు.