Oct 07,2023 23:50

మంగళగిరి: నియోజకవర్గంలో అవినీతికి తావు లేదన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకష్ణారెడ్డి ఎయిమ్స్‌ గేటు వద్ద జరుగుతున్న అక్రమ తవ్వకాలపై సమాధానం చెప్పాలని టిడిపి నాయకులు డిమాండ్‌ చేశారు. తవ్వకాల ప్రాంతం వద్ద నాయకులు శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మునగపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే అండతోనే ఎయిమ్స్‌ వద్ద ఉన్న కొండను నెలరోజులుగా తవ్వుతున్నారని అన్నారు. దీనిపై గతంలో తమ పార్టీ పరిశీలించగా తవ్వకాలను కొన్ని రోజులు ఆపేసినా మళ్లీ మొదలుపెట్టారని అన్నారు. అక్రమ క్వారీయింగ్‌పై అటవీశాఖాధికారులను సమాచార చట్టం ద్వారా వివరాలు అడిగినా సమాచారం లేదంటున్నారని, ఫారెస్టు భూముల్లో పేదలు ఇళ్లేసుకుంటే కూల్చే అధికారులు... వెయ్యి లారీలతో ఎర్రమట్టిని తవ్వేస్తుంటే చోద్యం చూస్తున్నారని విమర్శించారు. నిరసనలో నాయకులు అబ్దుల్‌ మజీద్‌, జి.దుర్గారావు, ఎం.రమేష్‌, టి.కోటరు, వి.శ్రీనివాసరావు, కె.సురేష్‌, పి.సుందరయ్య, ఎన్‌.పురుషోత్తమ రాజు, సిహెచ్‌.ఏసుపాదం, టి.శంకర్‌ పాల్గొన్నారు.