Oct 21,2023 00:49

వినతిపత్రాన్ని ఇస్తున్న నాయకులు

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండల కేంద్రంలో 1/70 చట్టానికి తూట్లు పొడుస్తూ కిరాణా వ్యాపారి, గిరిజన నేతరుడు వైశ్యరాజ మధుసూదన్‌రావు ఎంపీడీవో క్వార్టర్స్‌ సమీపంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని తక్షణమే కూల్చి వేయాలని అదివాసి గిరిజన సంఘం మండల కార్యదర్శి కే.నరసయ్య ఆధ్వర్యంలో స్థానిక డిప్యూటీ తహసిల్దార్‌ రాజుకు శుక్రవారం వినతిపత్రంన్ని అందించారు. ఈ సందర్భంగా నర్సయ్య, జిల్లా కమిటీ సభ్యుడు లక్ష్మీపురం సర్పంచ్‌ కొర్రా త్రినాధ్‌, మండల వైస్‌ ఎంపీపీ పి.సత్యనారాయణలు మాట్లాడుతూ, 1/70 చట్టం గిరిజన ప్రాంతంలో అమలులో ఉన్నప్పటికీ ప్రభుత్వ భూములలో గిరిజనేతరులు దర్జాగా కబ్జా చేసి అక్రమ కట్టడాలు చేపడుతుంటే మండల రెవెన్యూ శాఖ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరించడం సరికాదన్నారు.మండల కేంద్రంలో 1/70 చట్టాన్ని అతిక్రమిస్తూ అక్రమ కట్టడాలను చేపడుతున్నారన్నారు. ుధుసూదన్‌ రావు నిర్మిస్తున్న అక్రమ కట్టడానని తక్షణమే కూల్చివేయాలని, లేని పక్షాన ఆదివాసి గిరిజన సంఘం నాయకుల ఆధ్వర్యంలో కూల్చి వేస్తామన్నారు. గతంలో ఇదే తరహాలో అనేకమార్లు రెవెన్యూ శాఖకు ఫిర్యాదులు చేసినా అక్రమ కట్టడాన్ని అడ్డుకోలేకపోయారన్నారు. తక్షణమే ఎల్‌టిఆర్‌ కేసు కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.అధికార పార్టీ రాజకీయ నాయకుల అండదండలతోనే మండల కేంద్రంలో గిరిజనేతరులు అక్రమ కట్టడాలు కడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘ నాయకులు ఎస్‌,గాశిరం దొర, జి నారాయణ, పి.రామదాసు, ఏం.నర్సింగ్‌ పడల్‌, కె.బాలరాజు, సిపిఎం మండల కార్యదర్శి భీమరాజు పాల్గొన్నారు.