ప్రజాశక్తి అనంతగిరి:1/70 వంటి చట్టాలను తుంగలో తొక్కి అక్రమంగా నిర్మించుకున్న అక్రమ కట్టడాలను తక్షణమే కుల్చి వేయాలని స్థానిక జెడ్పిటిసి గంగరాజు, చిలకలగెడ్డ సర్పంచ్ మజ్జి. అప్పారావు, టోకూరు సర్పంచ్ కె.మొస్యలు డిమాండ్ చేశారు. సోమవారం మండల పరిషత్ విఒపి ఆర్డి మల్లేశ్వరరావుకు కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, చిలకలగడ్డ పంచాయతీ గ్రామంలో గిరిజన నేతురులకు గిరిజన చట్టాలను, హక్కులను లెక్క చేయకుండా రాత్రి సమయంలో ఇంటి శ్లాబ్ వేసారన్నారు పంచాయతీ అధికారులు గిరిజనేతురాలికి ఇల్లు కట్టుకున్నందుకు అనుమతులు ఏమైనా ఇచ్చారా అని అధికారులను ప్రశ్నించారు. పనులు చేస్తున్నప్పుడు వీఆర్వో, సెక్రటరీ ఎందుకు నిలుపుదల చేయలేదని నిలదీశారు.ఆమెపై రెవిన్యూ అధికారులు ఎల్టిఆర్ కేసు నమోదు చేయాలని, దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు.
అలాగే తహశిల్దార్ కార్యాలయం సమీపంలోని వైయస్సార్ వీధిలో గిరిజనేతురుడైన సాయి నిర్మించుకుంటున్న అక్రమ నిర్మాణాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని జనసేన మండల ప్రతినిధి చిట్టం .మురళి కోరారు. తహసిల్దార్ రాంబాయిను కలిసి లిఖితపూర్వకంగా సోమవారం ఫిర్యాదు చేశారు. చట్టాలను, హక్కులను తుంగలో తొక్కి అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు జి. దేవన్న తదితరులు పాల్గొన్నారు.










