ప్రజాశక్తి-పాడేరుటౌన్: ఐటిడిఏకు ఐఎస్ఓ 9001 - 2015 ఉత్తమ పురష్కారం లభించింది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటిడిఏ పిఓ రోణంకి గోపాల క్రిష్ణ సోమవారం కలెక్టర్ చాంబర్లో ఐఎస్ఓ సర్టిఫికేట్ను సంస్థ ఎండి శివయ్య చేతుల మీదుగా స్వీకరించారు. కార్యాలయం నిర్వహణలో నాణ్యతలు పాటించడం, గిరిజనాభివృధ్ధి, ఉత్తమ వైద్య సేవలు, విద్యా ప్రమాణాలు, మెరుగైన జీవననోపాదుల కల్పన, గృహ నిర్మాణాలు, విద్యుదీకరణ, తాగునీటి సౌకర్యాల కల్పన వంటి రంగాలలో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలపై సంతృప్తి చెంది హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఐఎస్ఓ సర్టిఫికేషన్ జారీ చేసింది. గతంలో గిరిజన సహకారం సంస్థ, గిరిజన సంక్షేమ శాఖకు ఐఎస్ఓ సర్టిఫికేషన్ జారీ చేసామని ఐఎస్ఓ ఎండి. శివయ్య తెలియ జేసారు. రెండు తెలుగు రాష్టాలలో పాడేరు ఐటిడిఏకు ఐఎస్ఓ సర్టిఫికేట్ లభించిందన్నారు. అన్ని రకాల నాణ్యతా ప్రమాణాలు ఆడిట్ చేసిన తరువాత ఐఎస్ఓ సర్టిఫికేట్ ఇస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారులు విఎస్ ప్రభాకర రావు, ఎం.వేంకటేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఐ.కొండలరావు, ఇఇ డివిఆర్ఎం రాజు, పరిపాలనాధికారి హేమలత, డిఇఇ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.










