ప్రజాశక్తి - శ్రీకాకుళం: పోలీస్స్టేషన్లో నమోదైన ఐటి కేసులపై ప్రత్యేక దృష్టిసారించాలని ఎస్పి జి.ఆర్ రాధిక అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్స్టేషన్ను గురువారం సందర్శించారు. ముందుగా పోలీస్ స్టేషన్ పైభాగంలో ఉన్న కమాండ్ కంట్రోల్రూమ్ను సందర్శించి సిసి కెమెరాల పనితీరుపై ఆరా తీశారు. దర్యాప్తులో ఉన్న ముఖ్యమైన కేసుల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి గ్రేవ్ కేసులు, ఐటి కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సైబర్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సదురు బ్యాంకు అధికారులతో చర్చించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పారు. రాత్రివేళలో బీట్ల సంఖ్య పెంచి తరచూ నేరాలు జరిగే చోట బీట్ సిబ్బంది తిరుగుతూ పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. అవసరమైన చోట సిసి కెమెరాలను ఏర్పాటు చేసి నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణతో ప్రతిఒక్కరూ అంకితభావంతో పనిచేయాలన్నారు. ఎస్పి వెంట డిఎస్పి వై.శృతి, సిఐ పి.శ్రీనివాసరావు తదితరులున్నారు.










