ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్కు బడ్జెట్ పెంచాలని, అంగన్వాడీలకు తెలంగాణ లాగా జీతాలు పెంచాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయకుంటే సమ్మెకు సిద్ధమవుతామని ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ తెలిపారు. ఆదివారం చిత్తూరులో యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ సమావేశం శ్యామల అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల దగ్గర అన్ని ప్రభుత్వ పనులు చేయించుకుంటూ వారి సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు. దేశంలో, రాష్ట్రంలో శిశు మరణాలు రేటు తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తున్నది అంగన్వాడీలే అని మరి ఇలాంటి పథకాన్నికి నిధులు తగ్గించడం సిగ్గుచేటు అని, వెంటనే నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలను రకరకాల పద్ధతుల్లో వేధించడం మానుకోవాలన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పోరాటం చేస్తుంటే ఉక్కుపాదంతో అణచివేయడం ఏమిటి ప్రశ్నించారు. ప్రజాఉద్యమాలను అణచిన ఏ ప్రభుత్వాలు మనుగడ సాధించలేదని గుర్తు చేశారు. మహిళలను రాత్రిలో కూడా మహిళలను పోలీస్స్టేషన్లో పెట్టడం దారుణమని, కొత్త కొత్త యాప్లు పెట్టి అంగన్వాడీలకు మానసిక ఒత్తిడి తీసుకురావడంతో అనారోగ్య సమస్యలు తీవ్రంగా వస్తున్నాయని, వీటితో పాటు అంగన్వాడీలకు ప్రమోషన్లు ఇవ్వాలని, మినీ వర్కర్ను మెయిన్ వర్కర్స్గా గుర్తించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న స్థానిక సమస్యలపై పోరాటాలు నిరంతరం చేయాలన్నారు. ప్రజలకు సరఫరా చేస్తున్న పౌష్టికాహారం చాలా నాసిరకంగా ఉండడంతో వారు అంగన్వాడీలపై ఒత్తిడి చేస్తున్నారని, మంచి ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. యూనియన్ రాష్ట్ర కోశాధికారి వాణిశ్రీ, జిల్లా ప్రధాన కార్యదర్శి షకీల, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు, యూనియన్ జిల్లా నాయకులు పద్మ, పంచవర్ణ, ప్రమీల, మమత, లీల, జిల్లాలోని 12 ప్రాజెక్టుల నాయకులు హాజరయ్యారు.










