Jul 30,2021 10:42

ఢిల్లీ : ఎపి లో మూడు గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలకు కేంద్రం సూత్రపాయ అనుమతులిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి జనరల్‌ వీకే సింగ్‌ ప్రకటించారు. గురువారం లోక్‌సభలో ఎంపి రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నకు వీకే సింగ్‌ సమాధానమిస్తూ... ఇప్పటివరకు భోగాపురం, ఓర్వకల్లు, దగదర్తి విమానాశ్రయాలకు అనుమతులు ఇచ్చామని, అందులో ఓర్వకల్లులో కార్యకలాపాలు 2021 మార్చిలోనే ప్రారంభమయ్యాయని తెలిపారు. భోగాపురం, దగదర్తి విమానాశ్రయాలకు పనులను చేపట్టాలని అన్నారు. భోగాపురం విమానాశ్రయానికి రూ.2,500 కోట్లు, దగదర్తికి రూ.293 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. విమానాశ్రయాల నిర్మాణం, నిధుల సేకరణ బాధ్యత అంతా వాటిని అభివఅద్ధి చేసేవారిదేనని మంత్రి వీకే సింగ్‌ స్పష్టం చేశారు.

వెంచర్‌ విమానాశ్రయాల ద్వారా కోట్ల ఆదాయం..
దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా.. పిపిపి/ జాయింట్‌ వెంచర్‌ విమానాశ్రయాల ద్వారా 2020-21 వరకు రూ.30,069 కోట్లు సంపాదించిందని మంత్రి వీకే సింగ్‌ తెలిపారు. హైదరాబాద్‌, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా కన్సెషన్‌ ఫీజు రూపంలో 2020-21లో కేంద్రానికి రూ.856 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు.

విమానాశ్రయాల పేర్ల విషయంలో నిర్ణయం కేంద్రానిదే..
విమానాశ్రయాలకు కొత్త పేర్లు పెట్టడం, పేర్లను మార్చడం విషయమై హైదరాబాద్‌ ఎంపి అసదుద్దీన్‌ ఒవైసి అడిగిన ప్రశ్నకు మంత్రి వీకే సింగ్‌ జవాబిస్తూ.... విమానాశ్రయాల పేర్ల విషయమై రాష్ట్రాలు తీర్మానాలు పంపాలని, తుది నిర్ణయాధికారం కేంద్ర కేబినెట్‌దేనని స్పష్టం చేశారు. ఇప్పటివరకు విమానాశ్రయాలకు పేర్లు పెట్టడం, మార్చడంపై 13 రాష్ట్రాల నుంచి అసెంబ్లీ తీర్మానాలు వచ్చాయని వెల్లడించారు. విమానాశ్రయాలు, టర్మినల్‌ సముదాయాలకు కొత్తగా పేర్లు పెట్టడం, ఉన్నపేర్లను మార్చడంపై రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానాలు చేసి, కేంద్రానికి సిఫార్సు చేయాల్సి ఉంటుందని జనరల్‌ వీకే సింగ్‌ వివరించారు.

గత మూడేళ్లుగా బొగ్గు లభ్యత తగ్గింది : మంత్రి ఆర్‌కె సింగ్‌
ఢిల్లీ : బొగ్గు అవసరం విషయమై గురువారం లోక్‌సభలో కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్‌కె సింగ్‌ సమాధానమిస్తూ... గత మూడేళ్లుగా బొగ్గు లభ్యత తగ్గుముఖం పట్టిందన్నారు. ఎపి లోని 17 గ్యాస్‌ ఆధారిత విద్యుత్తు కేంద్రాలకు రోజూ 24.08 మిలియన్‌ మెట్రిక్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ అవసరముందని అన్నారు. విద్యుత్తు ఉత్పత్తి కోసం ఎపి లోని 9 థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలకు ఏటా 4.43 కోట్ల టన్నుల బొగ్గు అవసరమవుతుందని తెలిపారు. తెలంగాణలోని 8 ప్రాజెక్టులకు 3.23 కోట్ల టన్నుల బొగ్గు కావాల్సి ఉంటుందని మంత్రి ఆర్‌కె సింగ్‌ పేర్కొన్నారు.