ఐఎంఎ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ నరేంద్రరెడ్డి

ప్రజాశక్తి - గుంటూరు సిటి : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా డాక్టర్ నూతక్కి శ్రీనివాస్, డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం రాత్రి గుంటూరులోని ఐఎంఎ హాలులో జరిగిన సమావేశంలో నూతన కమిటీని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ నూతక్కి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ వెలగ మహేష్, కార్యదర్శిగా డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ బి.సాయికృష్ణ ఎన్నికయ్యారు. అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ కమిటీ అభివృద్ధికి దోహదపడటంతో పాటు, స్థానికంగా వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ విభాగాల్లో వస్తున్న సాంకేతిక అభివృద్ధిని ఇక్కడి వారికి పరిచయం చేసేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.