ప్రజాశక్తి-విఆర్.పురం
డిసెంబర్ 4న విఆర్.పురంలో జరగనున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రంపచోడవరం జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఐ.పద్మ, మండల కార్యదర్శి ఎస్.పార్వతి పిలుపునిచ్చారు. ఐద్వా మండల కమిటీ సమావేశం ఎంపిపి కారం లక్ష్మి అధ్యక్షతన సోమవారం మండల కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగ పద్మ, పార్వతి మాట్లాడుతూ మహిళా సమస్యల పరిష్కారానికి నిరంతరం ఐద్వా పని చేస్తుందని చెప్పారు. దేశంలో స్త్రీల పట్ల జరిగే సాంఘిక దురాచారాలను ఎదుర్కోవటంలో ఐద్వా ఎప్పుడూ ముందుంటుందన్నారు. వరకట్నం దురాచారాలకు బలైపోతున్న ఎందరినో మహిళను ఆదుకుందని తెలిపారు. పోలవరం నిర్వాసితుల తరుపున ఐద్వా పోరాటం చేసిందని గుర్తు చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసరాల ధరల పెరుగుదలను అరికట్టాలని, మద్యం అమ్మకాలపై పరిమితి విధించాలని పోరాడుతున్నట్లు చెప్పారు. బాలల బంగారు భవిష్యత్తు కోసం 5వ ట్యూషన్ కేంద్రాలను నిర్వహిస్తుందన్నారు. అమరవీరుల గడ్డపై జరిగే ఐద్వా జిల్లా మహాసభ సందర్భంగా అన్ని గ్రామాల్లో ఐద్వా జెండా ఆవిష్కరణలు చేయాలని, మహాసభకు తరలిరావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో భారతి, జయమ్మ, లక్ష్మి, సుజాత, దారమ్మ తదితరులు పాల్గొన్నారు.










