Oct 21,2023 20:47

ప్రజాశక్తి - పెనుమంట్ర
పొలమూరు నుంచి నవుడూరు సెంటర్‌ వరకూ అధ్వానంగా ఉన్న ఆర్‌అండ్‌బి రహదారిని తక్షణం నిర్మించాలని సిపిఎం సీనియర్‌ నాయకులు జుత్తిగ నరసింహమూర్తి డిమాండ్‌ చేశారు. శనివారం పొలమూరు నుంచి ప్రారంభమైన పాదయాత్రలో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఈ రహదారుల వెంట ప్రయాణం చేయాలంటే భయపడుతున్నారన్నారు. వర్షపు నీరు గోతుల్లో చేరి చెరువులను తలపిస్తున్నాయని, దీంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌అండ్‌బి రహదారులకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. పాదయాత్ర బృందానికి సంఘీభావం తెలియజేస్తూ మాజీ సర్పంచి, టిడిపి నేత చింతపల్లి రామకృష్ణ మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే ఆర్‌అండ్‌బి రహదారులకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పొలమూరు గ్రామం నవుడూరు బస్టాండ్‌ వరకూ పాదయాత్ర నిర్వహించారు. బస్టాండ్‌ వద్ద జరిగిన సభలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్‌ మాట్లాడుతూ బ్రాహ్మణ చెరువు నుండి వీరవాసరం వరకూ ఆర్‌అండ్‌బి రహదారి పెద్ద పెద్ద గోతులతో ఉన్న కారణంగా విద్యార్థులు, ప్రజలు నానా అవస్థలు పడుతున్నారన్నారు. తక్షణం రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కూసంపూడి సుబ్బరాజు, సిపిఎం శాఖ కార్యదర్శి రాపాకా ఆశీర్వాదం, చింతపల్లి తిరుమలరావు, బత్తుల విజరు కుమార్‌, రాజారావు, అయినంపూడి బాబూరావు, కోటేశ్వరరావు ఎం.త్రిమూర్తులు, తాళ్లూరి రాము, నారాయణమూర్తి పాల్గొన్నారు.