అధిక ధరలు, నిరుద్యోగ నిర్మూలనకు వ్యతిరేకంగా నేటి నుంచి సమరభేరి : సిపిఎం

రాయచోటి టౌన్ అధిక ధరలు, నిరుద్యోగం, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల భారాలతో ప్రజలను దోచుకుతింటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమరభేరి పేరుతో ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్లు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ. రామాంజులు తెలిపారు. మంగళవారం స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో సమరభేరి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం విధిస్తున్న షరతులకు తలొగ్గి రాష్ట్రం ఇష్టం వచ్చినట్లు భారాలు మోపుతోందని అన్నారు. ప్రపంచ బ్యాంకు షరతులను కేంద్రం అమలు చేస్తూ రాష్ట్రాలపైనా రుద్దుతోందని చెప్పారు. రాష్ట్రం కూడా అప్పుల కోసం కేంద్రం విధించిన షరతులన్నీ అమలు చేస్తోందని వాపోయారు. దీనివల్ల సామాన్య ప్రజలపై మోయలేని భారాలు పడుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని, గతంలో రూ.150 బిల్లు వస్తే ఇప్పుడు రూ.300 వస్తోందని, అంటే బిల్లు 100 శాతం పెరిగిందని, ఇంత పెద్దఎత్తున భారాలు పడుతుండటంతో పరిశ్రమలు కూడా మూతబడుతున్నాయని చెప్పారు. ఇవి చాలదన్నట్లు వ్యవసాయ మోటార్లకు, ఇళ్లకు స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. ట్రూఅప్, ఫ్యూయల్ సర్ఛార్జి పేరుతో ఎప్పుడో వాడుకున్న విద్యుత్కు ఇప్పుడు భారాలు వేస్తున్నారని, అద్దె ఇళ్లలో ఉండే సామాన్యులకు ఇది పెనుభారంగా మారుతోందని వివరించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా చేసిన ఆందోళనలను, ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి చేసిన దీక్షలను గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే తన సొంత కంపెనీలకే వాటాలు కట్టబెడుతూ దోచుకుంటున్నారని విమర్శించారు. స్మార్ట్ మీటర్లను అదానీ కంపెనీల నుండి కొనుగోలు చేస్తున్నారని వివరించారు. ఈ నెల 30, 31 తేదీల్లో ప్రచారం, సంతకాల సేకరణ, ఒకటోతేదీన సచివాలయాల్లో వినతిపత్రాలు సమర్పిస్తామని, నాలుగోతేదీన అన్ని మండల కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడతామని పేర్కొన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ప్రజా ఉద్యమం ఉధతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం చలపతివీధి, పిండిమిషన్ లైన్, కొత్తపేట, సాయిహాల్ రూట్లోని ప్రతి ఇంటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు యం.మూధవయ్య శేఖర్ రెడ్డెయ్య అనిల్ పాల్గొన్నారు.