ప్రజాశక్తి-ఆదోనిరూరల్
ఆదోనిని కరువు మండలంగా ప్రకటించాలని రైతుసంఘం జిల్లా అధ్యక్షులు కె.వెంకటేశులు కోరారు. బుధవారం సిఐటియు కార్యాలయంలో రైతు సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశులు, రైతు సంఘం మండల కార్యదర్శి అయ్యప్ప, మండల అధ్యక్షులు శేఖర్, మండల కమిటీ సభ్యులు తిక్కన్న మాట్లాడారు. కర్నూలు జిల్లాలో మండలాలను కరువుగా ప్రకటించినప్పటికీ ఆదోని, క్రిష్ణగిరి మండలాలను మద్యస్థ కరువు మండలాలుగా ప్రకటించడం అన్యాయమని తెలిపారు. ఆదోని మండలంలో కరువు తీవ్రంగా నెలకొందని, పత్తి, మిరప, వేరుశనగ, కంది తదితర పంటలు పూర్తిగా ఎండిపోయాయని చెప్పారు. పత్తి పంట ఎకరాకు ఒక క్వింటా కూడా వచ్చే పరిస్థితి లేదని, వేరుశనగ రెండు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. మిరప పంట పూర్తిగా ఎండిపోతోందని చెప్పారు. తక్షణమే ఆదోనిని తీవ్రమైన కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఎకరాకు రూ.50 వేల పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనులు 200 రోజులు కల్పించాలని కోరారు. ఈనెల 6న తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నట్లు తెలిపారు. రైతులందరూ ధర్నాలో పాల్గొనాలని కోరారు.
మాట్లాడుతున్న వెంకటేశులు