Nov 21,2022 23:58

గిరిజనులకు రగ్గు అందజేసిన అమ్మ ఛారిటబుల్‌ ట్రస్టు సభ్యులు

ప్రజాశక్తి - అనంతగిరి
మండలంలోని కొత్తూరు పంచాయతీ పరిధిలో ఆదివాసీలకు అమ్మ ఛారిటబుల్‌ ట్రస్టు పలు రూపాల్లో సేవలు అందిస్తోంది. ఈ పంచాయతీ పరిధిలోని బూసుపాడు, టెంకిబిడ్డ గ్రామాలకు ట్రస్టు ప్రతినిధులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సుమారు 10 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి 25 మంది గిరిజన కుటుంబాలకు రగ్గులు పంపిణీ చేశారు. ఎముకులు కొరికే చలితో గిరిజనులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ రగ్గులు పంపిణీ చేసినట్లు ట్రస్టు చైర్మన్‌ గొంప వెంకటరావు తెలిపారు.
అంతర్జాతీయ మారథాన్‌ క్రీడాకారుడు గోపికి బూట్లు అందజేత
ఇటీవల జరిగిన జాతీయ మారథాన్‌ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి, పూణెలో జరగనున్న అంతర్జాతీయ మారథాన్‌ పోటీలకు వెళ్తున్న కొత్తూరు పంచాయితీ పరిధి తుమ్మనవలస గ్రామానికి చెందిన కొర్ర గోపికి అమ్మ ఛారిటీస్‌ వారు గ్రామ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా బ్రాండెడ్‌ షూ (బూట్లు) అందజేశారు.
కెజిబివి విద్యార్థినులకు కెరీర్‌ గైడెన్స్‌ పుస్తకాలు పంపిణీ
కొత్తూరులో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థినులకు అమ్మ ఛారిసీటీ వారు కెరీర్‌ గైడెన్స్‌ పుస్తకాలను అందజేశారు. ట్రస్టు ఉపాధ్యక్షులు సింగంపల్లి అర్జున అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో కెజిబివి ఇన్‌ఛార్జి ఎస్‌ఒ భారతి, ఉపాధ్యాయులు దమయంతి, సూరెడ్డి బాబూరావు, దొగ్గ ఎరుకునాయుడు, లెక్కల నారాయణరావు లెక్కల కోటేశ్వరరావు, లెక్కల సత్యనారాయణ, ట్రస్టు కార్యదర్శి సింగంపల్లి అచ్చిబాబు, మహిళా పోలీసు లావణ్య, వాలంటీరు రాము, వార్డు సభ్యులు శ్రీను పాల్గొన్నారు.