ప్రజాశక్తి - పరవాడ
అదాని సంస్థలలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు కెఎస్ఎ.రామయ్య నాయుడు ఆధ్వర్యంలో లంకెలపాలెం వద్ద ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రామయ్య నాయుడు మాట్లాడుతూ దేశ ప్రజల ఆస్తి భారతీయ స్టేట్ బ్యాంకు, భారతీయ జీవిత బీమా సంస్థల మనుగడ దెబ్బతినెలా సుమారుగా 50,000 కోట్ల రూపాయలు అప్పుగా అదాని సంస్థలు తీసుకొని ఆర్ధిక నేరానికి పాల్పడ్డారని తెలిపారు. గడిచిన 9 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు దొడ్డి దారిలో అప్పులు ఇప్పిస్తుందన్నారు. అనేక మార్లు రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని అదాని సంస్థలపై హిండెన్ బర్గ్ జరిపిన పరిశోధన నివేదికలో తేటతెల్లమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆర్ఆర్ నాయుడు, విన్నకోట రాము, బిఎస్ నాయుడు, కత్తెర శ్రీధర్, మలపు రెడ్డి కోటేశ్వరరావురావు, బోయిన భాను మూర్తి యాదవ్, సూరిశెట్టి ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు.










