Sep 14,2023 20:50

ఈ చౌల్ట్రీస్‌ స్థానంలోనే నిర్మాణం కానున్న అచ్యుతం, శ్రీపదం

రూ.600 కోట్లతో గోవిందరాజస్వామి చౌల్ట్రీస్‌ వద్ద..
అచ్యుతం, శ్రీపదం
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
తిరుమల, తిరుపతిలో అందుబాటులో ఉన్న వసతిని మరింత పెంచేందుకు భారీ కార్యాచరణ సిద్దం చేస్తోంది. అందులో భాగంగా రెండు భారీ వసతి సముదాయాలను టిటిడి నిర్మించబోతోంది. ఏకంగా రూ. 600 కోట్లను కేటాయించిన టీటీడీ 20 వేల మంది భక్తులకు ఒకే చోట వసతి కల్పించనుంది.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. తిరుమలతో పాటుగా తిరుపతిలోనూ వసతి గహాల సంఖ్య ఉన్నా సరిపోవటం లేదు. వీటిని పెంచాలనే డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. కొంత కాలం క్రితం తిరుమల కొండ పైన ఉన్న వసతి గహాల్లో మరమ్మత్తులు నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా వినియోగంలో ఉన్న వాటిల్లో సౌకర్యాలు పెంచారు. ఇక తాజాగా జరిగిన పాలక మండలి సమావేశంలో వసతి సమస్య పరిష్కారం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ 600 కోట్లతో టిటిడి పాలకమండలి 20 వేల మంది భక్తులకు ఒకే చోట వసతి కల్పించేలా అధునాతన సౌకర్యాలతో వసతి గహాలను అందుబాటులోకి తీసుకు రానుంది. అచ్యుతం, శ్రీపదం పేరుతో రెండు వసతి సముదాయాలను భక్తుల వసతి కోసం నిర్మించాలని నిర్ణయించింది.
తిరుపతి రైల్వే స్టేషన్‌ వెనుక ఉన్న గోవిందరాజస్వామి ఉచిత సత్రాలను తొలగించి వాటి స్థానంలో కొత్తగా వసతి సముదాయాలు నిర్మించాలని భావించింది. 1959లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజ్‌ ప్రారంభించిన శ్రీ గోవిందరాజ స్వామి 2, 3 సత్రాలను తొలగించి అచ్యుతం, శ్రీపదం పేరుతో 20 వేల మంది యాత్రికులకు వసతి కల్పించేలా వసతి సముదాయాలు నిర్మించాలని నిర్ణయించింది. తిరుపతిలో టీటీడీకి చెందిన శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం తోపాటు పద్మావతి అతిథి గహం భక్తులకు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు రైల్వే స్టేషన్‌ వెనుక వైపు శ్రీ గోవిందరాజ స్వామి ఉచిత సత్రాలు, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్‌ భక్తులకు అందుబాటులో ఉన్నాయి. అయినా, రద్దీకి అనుగుణంగా వసతి దక్కటం లేదు. 65 ఏళ్ల పాటు తిరుమల వెంకన్న దర్శనం కోసం వచ్చిన భక్తుడికి ఉచితంగా వసతి సేవను అందించిన శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో రూ. 600 కోట్లతో అధునాతన వసతులతో తిరిగి టీటీడీ భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయంచింది.
ఈ చౌల్ట్రీస్‌ స్థానంలోనే నిర్మాణం కానున్న అచ్యుతం, శ్రీపదం