Nov 14,2023 22:29

సంతబొమ్మాళి : పతకాన్ని ఆవిష్కరిస్తున్న జగన్నాయకులు

* జిల్లా సహకార అధికారి ఎన్‌.సుబ్బారావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
దేశంలో సహకార వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉందని, డిజిటలైజేషన్‌ను అన్వయించుకుంటూ మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని జిల్లా సహకార అధికారి నీలం సుబ్బారావు అన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పతాకాన్ని ఎగురవేసి సహకార వారోత్సవాలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా నవంబరు 14 నుంచి 20వ తేదీ వరకు సహకార వారోత్సవాలను నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి సహకార రంగం ఎంతగానో సహకరిస్తూ ముఖ్య భూమిక పోషిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు వినూత్న సంస్కరణకు శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో డిసిఎఒ బి.నగేష్‌, టెక్కలి డివిజన్‌ డిప్యూటీ రిజిస్ట్రార్‌ పి.మురళీకృష్ణమూర్తి, శ్రీకాకుళం డివిజన్‌ డిఎల్‌ఒ కె.దామోదరరావు, డిసిసిబి జిఎం ఎస్‌.ఎస్‌ జగదీష్‌, డిజిఎంలు జి.సునీల్‌, ఎస్‌.వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇచ్ఛాపురం : సహకార వ్యవస్థకు జిల్లాలో స్వాతంత్య్ర సమరయోధుడు పుల్లెల శ్యామసుందరరావు ఊపిరి పోశారని పిఎసిఎస్‌ అధ్యక్షులు నరేంద్ర యాదవ్‌ అన్నారు. స్థానిక పిఎసిఎస్‌లో సహకార వారోత్సవాల్లో భాగంగా పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి దువ్వు వివేకానందరెడ్డి, కౌన్సిలర్‌ ప్రతినిధి బుడ్డెపు త్రినాథరెడ్డి, కేదారిపురం సర్పంచ్‌ నీలాపు సారథిరెడ్డి, డిసిసిబి మేనేజర్‌ తులసీబాయి తదితరులు పాల్గొన్నారు.
నందిగాం : లట్టిగాం పిఎసిఎస్‌ కార్యాలయం వద్ద పిఎసిఎస్‌ అధ్యక్షులు కురమాన బాలకృష్ణారావు, ఎంపిపి ఎన్‌.శ్రీరామ్మూర్తి పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల పరిషత్‌ ప్రత్యేక ఆహ్వానితులు చిన్ని జోగారావు యాదవ్‌, సర్పంచ్‌ పోలాకి మోహనరావు, పిఎస్‌ఎస్‌ సభ్యులు కవిటి వీరన్న పాల్గొన్నారు.
సంతబొమ్మాళి : సంతబొమ్మాళి పిఎసిఎస్‌ అధ్యక్షులు కెళ్లి జగన్నాయకులు పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు పిలక రవికుమార్‌రెడ్డి, మార్పు నాగభూషణరావు, కోటబొమ్మాళి డిసిసిబి బ్రాంచి మేనేజర్‌ ఉషాశాంతి, సూపర్‌వైజర్‌ కవితారాణి, సిఇఒ మాధురి పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరు : సహకార సంఘాల్లో సభ్యులు చేరడం ద్వారా ఆర్థికంగా బలోపేతం అవుతారని మండల వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులు దువ్వాడ మధుకేశ్వరరావు అన్నారు. 70వ అఖిల భారత సహకార సంఘాల వారోత్సవాల సందర్భంగా పిఎసిఎస్‌ కార్యాలయ ఆవరణలో పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిఇఒ ఎ.జగదీష్‌, సిబ్బంది కృష్ణ, బసవేశ్వరరావు, జయరాం పాల్గొన్నారు.