Sep 15,2023 21:58

విశ్వేశ్వరయ్య చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఇంజినీరింగ్‌ అధికారులు

విజయనగరం: దేశాభివృద్ధిలో ఇంజినీర్లది ముఖ్యపాత్ర అని జెడ్‌పిచైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. భారతదేశ మొట్టమొదట ఇంజినీర్‌ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా జాతీయ ఇంజినీర్స్‌డే వేడుకలు శుక్రవారం జెడ్‌పి సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన జెడ్‌పి చైర్మన్‌ తొలుత విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాను అభివద్ధి పదంలో తీసుకెళుతున్న ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖల ఇంజినీరింగ్‌ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మొక్కలు నాటారు. ఈసందర్బంగా పలువురు రక్త దానం చేశారు. కార్యక్రమంలో సెంచూరియన్‌ యూనివర్సిటీ ఛాన్సలర్‌ జిఎస్‌ఎన్‌రాజు, పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటిపారుదలశాఖ ఎస్‌ఇలు గుప్తా, ఉమాశంకర్‌, ఇఇలు నాయుడు, రమణరాజన్‌, ఇంజినీరింగ్‌ ఫోరమ్‌ నాయకులు గోవిందరావు, రమణప్రబాత్‌, దివాకర్‌ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
సాయి కృష్ణా వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో
విజయనగరం టౌన్‌ : శ్రీ సాయి కృష్ణా వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో అయ్యన్నపేట జంక్షన్‌ వద్దనున్న వాకర్స్‌ నడక మైదానంలో ఇంజినీర్ల దినోత్సవాన్ని క్లబ్‌ అధ్యక్షుడు చెల్లూరి శ్రీనివాసరావు ఆధ్వర్యాన నిర్వహించారు. విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలవేసి క్లబ్‌ సభ్యులంతా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా క్లబ్‌ అధ్యక్షుడు రమణ, క్లబ్‌ గౌరవ సలహాదారులు ఎ.తిరుపతిరావు తదితరులు ఇంజినీర్ల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో క్లబ్‌ ఉపాధ్యక్షుడు వై. నలమరాజు, కోశాధికారి జి.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
'అవంతి'లో ఇంజినీర్స్‌డే వేడుకలు
డెంకాడ : స్థానిక అవంతి రీసెర్చ్‌, టెక్నాలజికల్‌ అకాడమీలో ఇంజినీర్స్‌ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయనగరం బిఎస్‌ ఎన్‌ఎల్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ డి.దాలి నాయుడుతో పాటు అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ బి. జగదీష్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. మోక్ష గుండం విశ్వేశ్వరయ్య గారి జీవితంలో ముఖ్య ఘట్టాలను చెప్పి విద్యార్థులను ఎంతో ఉత్సాహపరిచారు. ఇంజినీర్స్‌ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన పోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులను అభినందించారు. కళాశాల డైరెక్టర్‌ ఎస్‌.రాఘవరావు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.గోవిందరావు విద్యార్థులకు జ్ఞాపికలు, ధ్రువపత్రాలు అందజేశారు.
లెండీ కళాశాలలో..
లెండీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తరుణ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ సంస్థ ప్రతినిధి వి.స్వాతి మాట్లాడుతూ ఇంజినీరింగ్‌ విద్య ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ మధుసూదనరావు, ప్రిన్సిపల్‌ వివి రామరెడ్డి, సెక్రటరీ శివరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
సెంచూరియన్‌లో..
నెల్లిమర్ల : ప్రాజెక్టుల రూపశిల్పి, రాజనీతిజ్ఞుడుగా పేరుగాంచిన సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టిన రోజున ఇంజినీర్స్‌డే జరుపుకోవడం ఆనందదాయకమని వైస్‌ ఛాన్సెలర్‌ ప్రొఫెసర్‌ పి. కె.మహంతి అన్నారు. శుక్రవారం సెంచూరియన్‌ విశ్వ విద్యాలయంలో ఇంజినీర్స్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ విద్య ను థియరీ తోపాటు ప్రయోగత్మాకంగా కూడా నేర్చుకున్నపుడే విద్యార్థులు ఎక్కువ ఉపాధి అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పల్లవి మాట్లాడుతూ ప్రస్తుతం ఇండిస్టీ 4.0లో ఉన్నామని, అందుకు తగిన విధంగా విద్యార్థులు ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించాలని అన్నారు. అనంతరం బ్రోచర్‌ ను వైస్‌ ఛాన్సెలర్‌ ప్రొఫెసర్‌ పి. కె. మహంతి విడుదల చేశారు. కార్యక్రమంలో డీన్‌ డాక్టర్‌ సన్నీడియోల్‌, డాక్టర్‌ ఎన్‌.వి.ఎస్‌. శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.
కొత్తవలస ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో
కొత్తవలస : ఇంజినీర్స్‌ దినోత్సవం సందర్భంగా మోక్ష గుండం విశ్వేశ్వరయ్య జన్మదిన వేడుకలు ఘనంగా స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, తహశీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు కనీస సదుపాయాలు అలాగే సాంకేతిక పరిజ్ఞానం కూడా లేని కాలంలో ఎన్నో ఆనకట్టలు, పరిశ్రమలకు ఊపిరులూదిన గొప్ప దార్శనికులు అని అన్నారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.