Nov 20,2023 10:50
  • మతోన్మాదంతో బిజెపి అవినీతిలో బిఆర్‌ఎస్‌

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : ఈ ఎన్నికల్లో మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తోన్న బిజెపి, అవినీతిలో మునిగిపోయిన బిఆర్‌ఎస్‌, శాసనసభ సీట్లనే గుండుగుత్తగా అమ్ముకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ పోటీలో ఉన్నాయని, ఆ పార్టీల అభ్యర్థులు సంపాదించిన డబ్బుతో ఓట్లుకొని మరోసారి అధికారంలోకి రావాలని యత్నిస్తున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు విజయరాఘవన్‌ అన్నారు. పేదల పక్షాన నిలబడే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండలంలోని మేడారం గ్రామంలో సిరికొండ శ్రీను అధ్యక్షతన నిర్వహించిన హుజూర్‌నగర్‌ సిపిఎం అభ్యర్థి మల్లు లక్ష్మి ప్రచార యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నామని చెబుతున్నారని, కానీ మనం చీకటిలో మాట్లాడుతున్నామని అన్నారు. కేరళలో 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. కేరళలో ఎర్రజెండా ప్రభుత్వం పేదరికం లేకుండా చేయడంలో విజయవంతమైందన్నారు. విద్య, వైద్య రంగాల్లో ఘననీయమైన పురోగతి సాధించి దేశంలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని తెలిపారు. 99 శాతం కుటుంబాలకు భూమి ఉందని, 94 శాతం ప్రజలకు ఇళ్లుఉన్నాయని, మరో నాలుగు శాతం మంది పేదలకు రాబోయే మూడేళ్లలో ఇళ్లు నిర్మించే కేరళ వామపక్ష ప్రభుత్వం కార్యక్రమం చేస్తుందని వివరించారు. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. తెలంగాణలోనూ రాజకీయ ప్రత్యామ్నాయం రావాలంటే ఎర్రజెండా నాయకత్వంలోని 19 మంది అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా శాసనసభకు పంపిస్తే పేదలపక్షాన పోరాడి వాణి వినిపిస్తారన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌ మాట్లాడుతూ, హుజూర్‌నగర్‌ నియోజవర్గంలో కాంగ్రెస్‌ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బిఆర్‌ఎస్‌ నుండి సైదిరెడ్డి ఇద్దరిలో ఏ ఒక్కరూ మల్లు లక్ష్మితో సరితూగగలరా? అని ప్రశ్నించారు. మల్లు లక్ష్మి చిన్నతనం నుండే పోరాటాల్లో పాల్గొన్నారని, మల్లు స్వరాజ్యం వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని జైలుకు వెళ్లారని, లాఠీ దెబ్బలు తిన్నారని, ప్రజల పక్షాన పోరాడారని వివరించారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అరిబండి లక్ష్మీనారాయణ, జూలకంటి రంగారెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప మరొకటి లేదని తెలిపారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు టి.సాగర్‌, సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పాల్గొన్నారు.