
బీరుట్ : గాజాపై ఇజ్రాయెల్ సైన్యం బాంబు దాడులు ఆపాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్ హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితి ద్వారా ఇజ్రాయెల్కు ఇరాన్ ఓ ప్రైవేటు సందేశం పంపిందని జెరూసలేం పోస్టు ఆదివారం వెల్లడించింది. ఐరాస సమన్వయకర్త టోర్ వెన్నెస్ల్యాండ్ను ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హుస్సేన్ లెబనాన్ రాజధాని బీరుట్లో కలిశారు. యుద్ధ పరిస్థితిపై చర్చించారు. ఇజ్రాయెల్ పై కఠిన చర్యలు చేపట్టేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి హౌస్సేన్ అమిరబ్దొల్లాహియాన్ చెప్పినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
యుద్ధాన్ని ఆపాలని- సంక్షోభాన్ని అరికట్టాలనుకునేవారు ఈ అనాగరిక దాడులను అడ్డుకోవాలి : హౌస్సేన్
ఇటీవల అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ నేరుగా జోక్యం చేసుకునే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే హౌస్సేస్ తాజాగా అగ్రరాజ్యాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. '' గాజాలో ఇజ్రాయెల్ దురాక్రమణ ఆపకపోతే.. ఈ ప్రాంతంలోని అన్ని దేశాల చేతులు ట్రిగ్గర్పైనే ఉన్నాయి'' అని హౌస్సేన్ హెచ్చరించారు. ఈ సందర్భంగా హమాస్ దాడుల నాటి నుంచి ఇజ్రాయెల్కు మద్దతు ప్రకటిస్తున్న అమెరికాను కూడా ఇరాన్ విమర్శించింది. '' ఇలాంటి పరిస్థితులు నియంత్రిస్తామని, ఘర్షణలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా చూస్తామని ఎవరూ హామీ ఇవ్వలేరు. యుద్ధాన్ని ఆపాలని, సంక్షోభాన్ని అరికట్టాలనే ఆసక్తి ఉన్నవారు.. గాజాలో పౌరులపై జరుగుతున్న అనాగరిక దాడులను అడ్డుకోవాలి '' అని అమెరికాను ఉద్దేశిస్తూ హౌస్సేన్ పరోక్ష విమర్శలు చేశారు.