Oct 14,2023 13:17

అమరావతి : సోషల్‌ మీడియా వేదికగా తనపై వచ్చే రూమర్స్‌, విమర్శలకు నటి సోనమ్‌ కపూర్‌ ఎప్పుడూ స్పందిస్తూనే ఉంటారు. తాజాగా తన కుటుంబం గురించి హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేసినందుకు ఓ యూట్యూబర్‌కు ఆమె నోటీసులు పంపారు. సోనమ్‌ పంపిన లీగల్‌ నోటీసును కూడా ఆ యూట్యూబర్‌ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. అంతవరకు 7 వేలకు మాత్రమే ఉన్న ఆ యూట్యూబర్‌ సబ్‌స్క్రైబర్లు ఒక్కరోజులో 37 వేలకు పెరిగింది..!

అసలేం జరిగిందంటే ....
సోనమ్‌ కపూర్‌ ఆమె భర్త ఆనంద్‌ అహూజాల కాస్ట్యూమ్స్‌ బ్రాండ్ల గురించి రాగిణి అనే యూట్యూబర్‌ వీడియో చేశారు. అయితే, ఆ వీడియోలో ఆ దంపతుల గురించి ఆమె కామెడీగా మాట్లాడారు. ఇది సోనమ్‌ వరకు చేరడంతో వెంటనే ఆమె సదరు యూట్యూబర్‌కు లీగల్‌ నోటీసులు పంపారు. ఈ మొత్తం విషయంపై యూట్యూబర్‌ వివరణ ఇచ్చారు. '' నా వీడియో కింద ఎప్పుడూ ఒక నోట్‌ ఉంటుంది. 'నేను చేస్తున్న వీడియో ఎవరినీ ఉద్దేశించినది కాదు. నాకు ఎవరిపై ద్వేషం లేదు. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే '' అని అందులో రాసి ఉంటుంది. అని రాగిణి వివరణ ఇచ్చారు. సోనమ్‌ పంపిన లీగల్‌ నోటీసును కూడా ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై నెటిజన్లు సోనమ్‌ కపూర్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. ' కేవలం 7 వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్‌ వినోదం కోసం వీడియో చేస్తే ఇలా చేస్తారా ? ' అంటూ సోనమ్‌ పై విమర్శలు గుప్పించారు. ' పెద్ద షోల్లో ఎలాంటి కామెంట్స్‌ చేసినా నవ్వుతారు. ఇలాంటి వాళ్లకు మాత్రం నోటీసులు పంపుతారా ' అని ప్రశ్నించారు. అయితే, సోనమ్‌ కపూర్‌ వ్యవహారానికి ముందు రాగిణి ఛానల్‌కు 7 వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉండగా.. ఆ సంఖ్య ఒక్కరోజులోనే 37 వేలకు పెరిగింది.