Oct 16,2023 12:11

అమరావతి : భారత్‌ - పాక్‌ మ్యాచ్‌ సందడిలో బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌతేలా 24 క్యారెట్ల గోల్డ్‌ ఐఫోన్‌ పోయింది. ఈ విషయాన్ని ఆమె తాజాగా ఇన్‌స్టాలో తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు.

అక్టోబర్‌ 14న అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు పలువురు సెలబ్రెటీలు హాజరై సందడి చేశారు. వారిలో బాలీవుడ్‌ హీరోయిన్‌ ఊర్వశీ రౌతేలా కూడా ఉన్నారు. టీమిండియాను సపోర్టు చేస్తూ కనిపించారు. ఈ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలోనే ఊర్వశీ తన ఫోన్‌లో వీడియో తీసి అభిమానులతో పంచుకున్నారు. ఆ తర్వాత చాలామంది ప్రేక్షకులు ఆమెతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఆ సమయంలోనే ఫోన్‌ పోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాలో వెల్లడించారు. అది 24 క్యారెట్ల గోల్డ్‌ ఐఫోన్‌ అని.. ఎవరికైనా దొరికితే తెలియజేయాలని కోరారు. అలాగే ఈ విషయంలో సాయం చేయాలని కోరుతూ అహ్మదాబాద్‌ పోలీసులను ట్యాగ్‌ చేశారు. పోలీసుస్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు. ఆమె పోస్ట్‌కు స్పందించిన పోలీసులు ఫోన్‌ వివరాలు చెప్పాలని సమాధానమిచ్చారు.